ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యత గల నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. తాజాగా ఈ నియోజకవర్గం మరింత చర్చనీయాంశంగా మారింది. కారణం జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం. గత ఎన్నికల్లో టీడీపీ కీలక నాయకుడు వర్మ టికెట్‌ను వదులుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ సీటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పార్టీని సంస్థాగతంగా బలపరిచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల మూడో వారంలో ఆయన పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ, మండల స్థాయిలో పార్టీకి కొత్త నాయకులను ఎంపిక చేసి, అవసరమైతే ప్రస్తుత అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని సమాచారం. అంటే స్థానిక స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో పవన్ ముందుకు సాగుతున్నారు.


ఇది సహజంగానే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు పిఠాపురం టీడీపీకి గట్టి బేస్‌గా ఉన్న ప్రాంతం. కానీ గత ఎన్నికల్లో వర్మ టికెట్ వదిలి పవన్‌కు మద్దతు ఇవ్వడం వల్ల జనసేన ఇక్కడ బలపడింది. ప్రస్తుతం వర్మ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో అంతర్గతంగా కదలికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ జనసేన అడుగుల దృష్ట్యా ఆయనకు అవకాశాలు మరింతగా స‌న్న‌గిల్లుతున్నాయి. జనసేన వర్గాలు మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్‌నే పిఠాపురం నుంచి పోటీ చేయించడం ఖాయమని చెబుతున్నాయి. నియోజకవర్గ మార్పు ఉండదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక స్థాయిలో కొత్త నాయకులను నియమిస్తూ పార్టీని బలోపేతం చేయడం ప్రారంభించారు. దీంతో వర్మ, ఆయన అనుచరులు తదుపరి వ్యూహం ఏంటి అనే ఆలోచనలో పడ్డారు.


వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వర్మ నియోజకవర్గాన్ని వదలాలని అనుకోలేదు. కానీ అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు మరో కీలక పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు పిఠాపురం అంశంపై ఎక్కడా స్పందించకపోవడం, పార్టీ తరఫున చర్చించకపోవడం వర్మకు పెద్ద షాక్‌గా మారింది. దీంతో జనసేనకు ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అప్పగించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వర్మకు టికెట్ లభించే అవకాశం చాలా తక్కువ. అందువల్ల ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారనే మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: