- ( ఉత్త‌రాంధ్రా - ఇండియా హెరాల్డ్ ) . . .

శ్రీకాకుళం జిల్లాలో శ‌నివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలోని కాశీబుగ్గలో ఉన్న విజయ వెంకటేశ్వర ఆలయంలో తీవ్ర‌మైన‌ తొక్కిసలాట జరిగింది. మొత్తం 10 మంది భక్తులు చనిపోగా.. పలువురు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వెంట‌నే స్థానికులు తేరుకుని  క్షతగాత్రుల్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కార్తీక మాసం, అందులోనూ ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ని ద‌ర్శించుకు నేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులకు త‌గిన‌ట్టుగా ఇక్క‌డ ఏర్పాట్లు చేయ‌లేద‌ని ప్రాథ‌మిక స‌మాచారం. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.


ప్రాథ‌మిక స‌మాచారం ఆధారంగా ఆలయంలో ఏర్పాటు చేసి క్యూలైన్లకు సంబంధించిన రెయిలింగ్ ఊడిపడటంతో భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. ఆలయానికి వచ్చిన వారిలో ఎక్కువమంది మహిళా భక్తులు ఉన్నారని తెలుస్తోంది. ఓ భ‌క్తుడు ఈ ఆలయాన్ని 12 ఎకరాల్లో నిర్మించినట్లు చెబుతున్నారు. హ‌రిదాస్ పాండా అనే భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం అనుకున్న‌ట్టుగా .. సంతృప్తిగా దక్క లేదని కాశీబుగ్గలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. 12 ఎకరాల్లో రూ.10 కోట్ల కు పైగా బ‌డ్జెట్‌తో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏకాదశి రోజు ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు.


ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలోని  కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: