విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం మరింత దుమారంగా మారింది. ఇటీవల ఓ 15 రోజుల కిందట సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ లు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకున్నామని, కేంద్రం నుంచి 1400 కోట్ల రూపాయల సొమ్ము తీసుకువచ్చి ఉక్కు పరిశ్రమను బ‌లోపేతం చేస్తున్నామని చెప్పారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకున్నామని గత వైసిపి ప్రభుత్వం దీనిపై కల్లబొల్లి మాటలు చెప్పి కన్నీరు కార్చిందే తప్ప ఏమీ చేయలేదని ఆయన సంచలనం వ్యాఖ్య‌లు చేశారు.


కర్నూలులో నిర్వహించిన సభలో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకున్నామన్న మాటను నారా లోకేష్ నోటి నుంచి అందరూ విన్నారు. అయితే, ఏం జరుగుతుందన్నది ఈ విషయంలో తెలియడం లేదు. ఎందుకంటే రాష్ట్రస్థాయిలో నాయకులు ఇలా చెబుతుంటే.. కేంద్రం స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు తాజాగా జరిగిన పరిణామాలు విశాఖ ఉక్కు పరిశ్రమపై అనేక అనుమానాలను మరింతగా పెంచాయి. అంతేకాదు ఉద్యోగులను మరింత తీవ్ర ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నాయి.


తాజాగా దీపావళి పండగ ముందు రోజు ఏకంగా 500 మంది ఉద్యోగులను విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం తొలగించింది. ఇది తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది. అంతేకాదు జాతీయ స్థాయిలో అయితే పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఒక పైపు నిధులు తీసుకొస్తున్నాం.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్రస్థాయిలో మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చెబుతుండగా కేంద్ర స్థాయిలో విశాఖ ఉక్కు కర్మాకారంలో ఉద్యోగులను పదేపదే తొలగించటం విమర్శలకు, అసలు ఏం జరుగుతుందన్న విషయానికి కూడా ప్రాధాన్యం పెంచింది.


ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నది విశాఖవాసులు కోరుతున్న మాట. ఎందుకంటే వచ్చే రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. అప్పుడైనా ఈ విషయం చర్చకి వస్తుంది. అప్పటివరకు నాన్చి ఈ విషయాన్ని తేల్చకుండా ఉంటే ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల్లో విశ్వసనీయతను దక్కించుకోవడం కష్టం అవుతుంది అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. విశాఖ  కర్మాగారం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖ‌రినైతే చెప్పాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: