నేటి రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం వంటి విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయనే విమర్శలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నా, చాలామంది రాజకీయ నాయకుల్లో ఆ లక్షణాలు కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది.  తాగాజా  పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తనను తాను ఇతర రాజకీయ నాయకులకంటే భిన్నంగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అదే ఆయన కొంప ముంచింది. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు, వివాదానికి దారితీస్తున్నాయి.తాను పార్టీలో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదని, తన కారణంగా ఎవరికీ నష్టం జరగలేదని భాష్యం ప్రవీణ్ స్పష్టంగా తెలిపారు. అంత వరకు బాగానే ఉంది. తనపై లేదా తన పనితీరుపై ఎవరికి అయినా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నేరుగా తన వద్దకు వచ్చి మాట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కూడా ఓకే బాగానే ఉంది.  సమస్యలను ప్రత్యక్షంగా చర్చించకుండా, లేనిపోని ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇది కొంత వరకు ఓకే.


అయితే, ఈ సందర్భంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. తనపై కావాలని బురదజల్లే ప్రయత్నం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లేనిపోని అభాండాలు వేస్తూ, తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారిని ఉపేక్షించకూడదని, అవసరమైతే వారికి “దేహశుద్ధి” చేయాల్సిందేనంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అలాంటి వారిని సెంటర్‌లో పడేసి కొట్టాలని పిలుపునిచ్చినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గానీ, వ్యక్తిగతంగా నాయకులపై తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా దేహశుద్ధి చేసిన వారిని తాను పూర్తిగా అండగా ఉంటానని, వారికి ఎలాంటి భయం అవసరం లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు రాజకీయ శీలతకు విరుద్ధమా కాదా అన్న అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.



అయితే, భాష్యం ప్రవీణ్ ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో, ఏ సమావేశంలో చేశారన్న విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. అయినప్పటికీ, తనపై కావాలని తప్పుడు ప్రచారం చేయాలనుకునే వారికి మాత్రం ఇది ఒక డైరెక్ట్ వార్నింగ్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ తరహా వ్యాఖ్యలు హింసను ప్రోత్సహిస్తున్నాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.ప్రస్తుతం భాష్యం ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనుకూల, ప్రతికూల అభిప్రాయాలతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒకవైపు ఆయన తెగువగా మాట్లాడారని కొందరు మద్దతు తెలుపుతుంటే, మరోవైపు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు తగవని మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ అంశం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: