నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవని ఆరోపించారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారు. ఇకపై సాధ్యం కాదని పేర్కొన్నారు. పలు అంశాలపై ఇవాళ ట్విటర్ వేదికగా విజయ సాయిరెడ్డి స్పందించారు.
విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు తీసుకున్నయూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయి. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయం వెల్లడించారని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అమ్మ ఒడి పథకం అన్ని పాఠశాలకు వర్తింపజేస్తామని సీఎం జగన్ మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో ఎల్లో మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఈ పథకంపై రకరకాల వార్తలను వండి వార్చింది. ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తారనే విధంగా అనుమానాలు రేకిత్తించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి 303 మంది సభ్యులున్నారు. ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదు. అయినా హోదా కోసం పోరాడుతూనే ఉంటామని మా ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడూ ఒకే మాట మీదున్నాం. చంద్రబాబులా హోదా సంజీవని కాదని ఎన్నడూ అనలేదు గదా? అని ఎద్దేశా చేశారు.