ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే విలువైన వస్తువులు పోగొట్టుకుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సింది జరిగిపోతుంది. అలాంటప్పడే అది మనకు రాసిపెట్టి లేదు అని సర్ది చెప్పుకుంటాం. కానీ ఆ పోయింది ఏ వందో, వెయ్యి రూపాయల విలువ కలిగిందైతే..అలాగే ఒకరోజు బాధపడి ఊరుకుంటాం. కానీ అలా పొగొట్టుకున్న వస్తువు చాలా ఖరీదైంది అయితే.. ఎంత ఇష్టపడి కష్టపడి కొనుక్కున్నది అయితే. ఆ బాధ వర్ణనానీతం.

 

సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైందట సౌతిండియన్ నటీమణి కుష్బూకు. ఆమె ఒక షో కోసం హైదరాబాద్ వచ్చి డైమండ్‌ రింగ్స్‌ పోగొట్టుకున్నారట. అదెలా జరిగిందంటే.. కుష్బూ సహజంగా సినిమా షూటంగుల్లో సొంత ఆభరణాలు పెట్టుకోరట. షూటింగ్ ప్రారంభానికి ముందే తన సొంత జ్యూయలరీ తీసేసి ఓ పెట్టెలో పెట్టి అసిస్టెంటుకు ఇచ్చేస్తారట. ఆయన వాటిని భద్రంగా భద్రపరుస్తాడు. షూటింగ్ అయిపోగానే మళ్లీ ఆమె వాటిని తీసుకుని అలంకరించుకుంటుంది.

 

కానీ హైదరాబాద్ లో ఓ షో కోసం వచ్చినప్పుడు షూటింగ్ సమయంలో .. తన సొంత డైమండ్ రింగ్స్ తీసేసి అసిస్టెంట్ కు ఇచ్చిందట. వాటిని జాగ్రత్తగా బాక్సులో పెట్టమని చెప్పిందట. ఆ అసిస్టెంట్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదట. ఓ టిష్యూ పేపర్ లో చుట్టి కుష్బూ ఉన్న టేబుల్ పైనే పెట్టాడట. అది కుష్బూ గమనించలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత కుష్బూ మేకప్ తీసేసమయంలో.. ఆ టిష్యూతోనే మేకప్ తుడుచుకుని దాన్ని డస్ట్ బిన్ లో పడేసిందట.

 

ఆ తర్వాత చెన్నై వెళ్లాక కానీ ఆ డైమండ్ రింగ్స్ ప్రస్తావన రాలేదట. అప్పుడు అసిస్టెంట్ ను అడిగితే మీ దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పాడట. అప్పడు సరిగ్గా గుర్తు తెచ్చుకుంటే.. తానే ఆ టిష్యూ పేపర్ తో మేకప్ తుడుచుకుని డస్ట్ బిన్ లో పడేసినట్టు గుర్తొచ్చిందట. వాటి ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా 23లక్షల రూపాయలు. ఇప్పటికీ ఆ ఘటన తలచుకుంటే బాధ అనిపిస్తుందట. అవును కదా మరి.. వందా వెయ్యా.. ఏకంగా 23 లక్షల రూపాయల నగలు. అదేమంటే ఏదో అలా జరగాల్సింది. అలా పోయింది.. అంటూ వేదాంతం చెబుతుంది కుష్బూ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ తమాషా ఘటనను కుష్బూ పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: