నెల్లిమర్ల: విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కోదండ రాముని ఆలయంలో విగ్రహాల ధ్వంసమైన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ఈ విగ్రహాలను తిరిగి ప్రతిష్టించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ముందుకు వచ్చింది. ఇక్కడ తయారు చేయించిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు శనివారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో రామతీర్థానికి చేరుకున్నాయి. తిరుమలలో నిష్ణాతులైన శిల్పులతో కృష్ణ శిలరాతితో తయారు చేయించిన ఈ విగ్రహాల రాకను పురస్కరించుకుని దేవస్థానం అర్చకులు, అధికారులు, పోలీసులు, స్థానికులు వెళ్లి ఘన స్వాగతం పలికారు.

అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, విగ్రహాలను వాహనం నుంచి కిందకు దించారు. అనంతరం వాటిని మోసుకుంటూ ప్రధాన ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు.  విగ్రహాలను రామతీర్థం ప్రధానాలయంలో ప్రత్యేకంగా ధాన్యంతో నింపి చక్కగా అలంకరించిన బాలాలయంలో భద్రపరిచారు. ఈ నెల 28వ తేదీన బాలాలయంలోనే సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు దేవదాయ శాఖ ఆర్‌జేసీ భ్రమరాంబ విలేకరులకు చెప్పారు. 25వ తేదీ నుంచి స్వామికి పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.  గత నెల 28న కోదండరాముని ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేసిన విషయం తెలిసిందే. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు టీటీడీ శిల్పులు పది రోజుల గడువుకు ముందే విగ్రహాలను చక్కగా తీర్చిదిద్ది రామతీర్థం ఆలయానికి అప్పగించారు.

విజయనగరం జిల్లా రామతీర్థ ఆలయాన్ని ఏడాది లోపే పునర్నిర్మాణం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. టీటీడీ నుంచి శుక్రవారం నూతన విగ్రహాలు రామతీర్థానికి తరలించినట్లు తెలిపారు. రామతీర్థ ఆలయాన్ని పూర్తిగా తొలగించి, సరిగ్గా ఏడాది లోపులో పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించామని, అప్పటివరకు విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: