ఎన్నికలు ముగిసిన తరవాత ఇక నాయకులంతా గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీ పరిస్థితిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
సాధారణంగా అన్ని సీట్లు మావే అనడం మామూలే కానీ.. ఆయన మాత్రం కుప్పం కూడా మేమే గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. కుప్పంలో చంద్రమౌళీ కుమారుడు బాగా హార్డ్ వర్క్ చేశాడని కితాబిచ్చారు. అదేంటి చంద్రబాబు కూడా ఓడిపోతాడా అని విలేఖరులు ఆయన్ను ప్రశ్నించారు.
సీఎం సొంత ఊరు ఉన్న నియోజకవర్గం చంద్రగిరిలో ఓడిపోగా లేనిది.. కుప్పంలో ఓడిపోకూడదని ఏముంది.. తక్కువ మార్జిన్తోనైనా సరే మేమే గెలుస్తాం.. అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబును అధికార బలంతో పోలీసు వ్యవస్థను వాడుకున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో అనేక చోట్ల టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు అందరికి తెలుసు. నాన్ పోకల్ పోర్స్ పెట్టి ఎన్నికలు నిర్వహించారు. ఒక ఇన్స్పెక్టరే డబ్బులు పంపిణీ చేశారు. మేం ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.