పోలవరం.. ఆంధ్రుల చిరకాల స్వప్నం.. ఎప్పుడో బ్రిటీష్ కాలంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలనే శంకుస్థాపన కూడా జరిగింది. కానీ ఆ తర్వాత దీన్ని పట్టించుకున్నవారు లేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ దీన్ని పట్టించుకునేవరకూ పోలవరం ఎవరికీ గుర్తు రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు కొంత పని జరిపించినా.. ఆ మహా ప్రాజెక్టును పూర్తి చేసే సువర్ణావకాశం మాత్రం జగన్ కే దక్కిందంటున్నారు వైసీపీ మంత్రులు.
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి భగవంతుడు అండగా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనమన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామన్నారు. పోలవరం పూర్తిచేసే గొప్ప అవకాశం సీఎం వైయస్ జగన్కు భగవంతుడు ఇచ్చాడన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషకరమన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి భగవంతుడు అండగా ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం.. నవంబర్ 1వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెడుతున్నామని మంత్రి అనిల్ చెప్పారు. రివర్స్టెండరింగ్ విధానంపై నవయుగ కంపెనీ కోర్టుకు వెళితే.. హైకోర్టు ప్రభుత్వానికి పాజిటివ్గా తీర్పు ఇవ్వడం సంతోషకరమన్నారు.
నవంబర్ 1వ తేదీన పోలవరం పనులు మొదలుపెడతామని చెబితే.. ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేశాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం.. మాట తప్పడం.. మడమ తిప్పడం మా నాయకుడికి, మా పార్టీ తెలియదని, ఇచ్చిన మాట ప్రకారం నవంబర్ 1వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టామని, రివర్స్టెండరింగ్ విధానంలో పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ భూమి పూజ చేసి పనులు కూడా మొదలుపెట్టిందన్నారు.
పోలవరంలో డ్యామ్, పవర్ ప్రాజెక్టులోనే రూ.750 కోట్లు ఆదా చేశామని, రూ.58 టన్నల్లో ఆదా జరిగిందని, మొత్తం రూ. 800 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా చేస్తూ.. పారదర్శకంగా ముందుకువెళ్తున్నామన్నారు. ప్రాజెక్టులు పూర్తికి టైమ్లైన్ పెట్టుకొని ముందుకువెళ్తున్నామని మంత్రి అనిల్ చెప్పారు. రాష్ట్రంలో 86 శాతం రిజర్వాయర్లు నిండాయని, 14 శాతం కూడా గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ను విస్మరించడం వల్ల 8 శాతం నింపుకోలేకపోయామన్నారు.