హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ శివార్లలోని ఇసుక స్టాక్ యార్డులో శనివారం (డిసెంబర్ 14) మధ్యాహ్నం కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పక్కనే చేతి గాజులు, చీరను గుర్తించారు. వీటి ఆధారంగా ఆ మృతదేహం మహిళదని నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో జరిగిన తహసీల్దార్ విజయా రెడ్డి సంఘటన తరువాత మరొక మహిళ మృతదేహం అదే పరిసరాల్లో దొరకడంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. 

 

అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో ఓ మహిళ మృతదేహం బయటపడటం కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుక్ చేసిన వ్యక్తికి అందులో మనిషి పుర్రె రావడంతో, అనుమానంతో ఇసుక స్టాక్ యార్డుకు వెళ్లి పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్నాడు. డెలివరీ అయిన ఇసుకలో మనిషి పుర్రె భాగం కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. స్టాక్ యార్డుకు వెళ్లి అక్కడి సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అక్కడి ఇసుకలో గమనించగా.. అందులో అస్థిపంజరం భాగాలు కనిపించాయి. ఇసుకలో చేయి భాగం ఓ చోట, తల భాగం ఓ చోట చెల్లాచెదురుగా కనిపించాయి. 
 

ఇసుక స్టాక్ యార్డు ప్రాజెక్టు అధికారి నిరంజన్‌ ఇచ్చిన సమాచారంతో ఎల్బీనగర్‌ ఇంఛార్జ్‌ డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఎసీపీ జయరాం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ మృతదేహం ఎవరిది? ఆ మహిళ ఎలా మరణించింది? ప్రమాదవశాత్తూ చనిపోయిందా? ఎవరైనా హత్య చేశారా? ఇసుక ద్వారా ఎక్కడి నుంచైనా వచ్చిందా లేదా చంపి ఇసుకలో పూడ్చి పెట్టారా? అనేది మిస్టరీగా మారింది. మృతదేహానికి సంబంధించిన ఆధారాలేవి గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. 

 

ఈ ఇసుకను 9 నెలల కిందట మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చి డంప్ చేసినట్లు పోలీసులకు నిరంజన్‌ తెలిపారు. ఇసుకతో పాటు మృతదేహం కూడా అప్పుడే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి పరిశీలిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: