దీపావళి కొనుగోళ్లలో భారత మార్కెట్లలో చైనాకు రూ. 40 వేల కోట్ల నష్టం జరిగింది. గాల్వన్‌ ఉద్రిక్తతల అనంతర పరిణామాల్లో, చైనాపై వ్యతిరేకత కొనసాగుతోంది. చైనా ఉత్పత్తుల బహిష్కరణ కు భారీగా మద్దతు లభించింది. దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా సుమారు 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. పండుగ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాగ్రి, ఫర్నీచర్, వాల్‌ హాంగాంగ్స్, బంగారం, ఆభరణాలు, ఫుట్వేర్, వాచ్‌ లు, దుస్తులు, ఇంటి అలకంరణ సామాగ్రి, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్, గిఫ్ట్ ఐటమ్‌ లు, స్వీట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి, తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ అంబానీ, టాటా, అజీం ప్రేమ్జీ, మిట్టల్ తదితర దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఏఐటీ గతంలో లేఖ రాసింది. భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్ చైనా అంటూ ప్రకటన కూడా విడుదల చేసింది.

మరోపక్క దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి అందిన వివరాలు ప్రకారం స్థానిక మార్కెట్లలో సుమారు రూ. 72 వేల కోట్ల  టర్నోవర్ జరిగింది. ఫలితంగా చైనా మార్కెట్‌ కు రూ.40 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

ఈ ఏడాది జూన్ లో గల్వాన్ లోయలో చైనా సైనికుల దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వాస్తవాధీన రేఖ యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ ఆర్మీని అడ్డుకునే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో టిక్టాక్, వీచాట్ తో పాటు అనేక చైనీస్ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు దీపావళి కొనుగోళ్లపైనా ఇది ప్రభావం చూపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: