గతంలో 2014లో తిరువీధి జయరాములు పార్టీ తరఫున గెలిచినా.. తర్వాత.. పార్టీ మారి చంద్రబాబుకు జై కొట్టారు. ఇక, గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న డాక్టర్ వెంకట సుబ్బయ్య.. అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆది నుంచి వైసీపీకి మంచి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి.. తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం.. అక్టోబరు 1న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 8గా నిర్ణయించారు.
ఉప ఎన్నికను అక్టోబరు 30న నిర్వహించనున్నారు. నవంబరు 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇదీ షెడ్యూల్ అయితే.. ఇక, రాజకీయ కాక ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో నడుస్తున్న పొలిటికల్ ఫైట్ ఈ ఉప ఎన్నికతో మరింత పెరుగుతుందని అంటున్నారు. ప్రభు త్వంపై నిప్పులు చెరుగుతున్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో.. చూడాలి. అదేసమయంలో ఈ ఉప ఎన్నికలో పవన్ ఒంటరి గానే బరిలోకి దిగుతారా? లేక.. ఇరు పక్షాలు పరస్పరం సహకరించుకుంటాయా? అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి.. రాజకీయాలు అయితే.. ఊపందుకున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 50 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే దక్కాయి. మరి ఈ దఫా.. ఏం జరుగుతుందో చూడాలి. ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ పింఛన్లు.. ఇతర సామాజిక లబ్ధిని ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేందుకు రెడీ అయింది. అయితే.. మళ్లీ ఇక్కడ మెజారిటీ పెంచుకునేందుకు వైసీపీ సహజంగానే ప్రయత్నించనుంది. మరి ఏం చేస్తారో చూడాలి.