అవును.. హూజూరాబాద్లో టీఆర్ఎస్ గెలవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిచిందంటే.. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిచినట్టు కాదు కదా.. అది సాక్షాత్తూ కేసీఆర్ గెలుపే అవుతుంది. అంతగా కేసీఆర్ హుజూరాబాద్ గెలుపుపై ఫోకస్ పెట్టారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోతే..అది టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ అవుతుంది. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఎదురు లేకుండా దూసుకెళ్తున్న కారు జోరుకు బ్రేకులు పడినట్టు అవుతాయి. అందుకే హుజూరాబాద్లో గెలుపు టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాతకరమైందని చెప్పొచ్చు.
మరి అలాంటి కీలక ఎన్నికలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ గెలవాలని రేవంత్ రెడ్డి ఎందుకు అనుకుంటారా.. ఎందుకంటే దానికో కారణం ఉంది. హుజూరాబాద్లో కాంగ్రెస్ కూడా తన పార్టీ అభ్యర్థిని రంగంలోకి నిలిపింది. అతడే బల్మూరి వెంకట్. అయితే అతన్ని పోటీకి దింపడం కేవలం లాంఛనమే. హుజూరాబాద్లో తమ పార్టీ అభ్యర్థి ఎలాగూ గెలవడన్న సంగతి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు.. ప్రధాన పోటీ టీఆర్ఎస్, ఈటల రాజేందర్ మధ్యే ఉంటుంది.
హుజూరాబాద్ ఎన్నికల్లో ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే.. అది బీజేపీకి పెద్ద బూస్ట్ అవుతుంది. ఇప్పటికే దుబ్బాకలోనూ, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన బీజేపికి పెద్ద ప్రోత్సాహకం అవుతుంది. అదే జరిగితే.. తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకు కూడా ఎసరు వస్తుంది. అందుకే.. హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్తి గెలవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది.