ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు గుడిసె జీవితాన్ని గుడిసెలోనే ముగించకుండా, సోంత ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఇంటి స్థలాలను కేటాయించేందుకు తాజా మార్గదర్శకాలను విడుదల చేస్తూ జీవో నంబర్‌ 23 ప్రకారం కొన్ని అర్హతల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు కొత్త జీవనాధారమవుతుందనే ఆశలు క‌నిపిస్తున్నాయి. ఈ పథకానికి అర్హులుగా నిలవాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగినవారు మాత్రమే అర్హులు. లబ్ధిదారుడు తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి. కుటుంబంలో ఎవరైనా వ్యక్తికి ఇప్పటికే స్థలం లేదా ఇల్లు ఉంటే వారికి ఈ అవకాశము ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకానికి అర్హులు కారు. అదే విధంగా మైనర్లకు కూడా ఈ పథకం వర్తించదు.


గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా మూడు సెంట్ల భూమిని, పట్టణాల్లో రెండు సెంట్ల భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించనుంది. కేటాయించిన స్థలంలో ఇంటిని నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలసి సమకూర్చనుంది. స్థలాన్ని కేటాయించిన తర్వాత రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. అంతేకాక, ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టడం, వేరే వారికి కేటాయించడం నిషేధం.అర్హులైన వారిలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి స్థలాలు మహిళల పేర్లపైనే ఇవ్వనున్నారు. గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000 లోపు, పట్టణాల్లో రూ.12,000 లోపు ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్థలం లభిస్తుంది. అర్హుల ఎంపిక గ్రామ సచివాలయాల ద్వారా జరుగుతుంది. ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించబడుతుంది. ఎలాంటి అభ్యంతరాలైనా గ్రామ సభల ద్వారా పరిష్కరించాల్సి ఉంటుంది.


ఇటీవల విడుదలైన మార్గదర్శకాల ప్రకారం, లీగల్ ఇబ్బందులు లేని స్థలాలను మాత్రమే ఎంపిక చేయాలని, అవసరమైతే ప్రైవేట్ భూములను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. కొన్ని మున్సిపాలిటీలలో స్థలాల లభ్యత ఉంటేనే పంపిణీ జరుగుతుంది. లభ్యమైన స్థలాల్లో ప్లాటింగ్ చేయడానికి, సర్వే చేపట్టడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఇది పేదలకి నిస్సందేహంగా అండగా నిలిచే పథకంగా మారనుంది. పేదలకు భూమిని ఇచ్చి ఇంటి కలను నెరవేర్చడమే కాకుండా, వారి జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పం ఇందులో ప్రతిఫలిస్తుంది. పారదర్శకతతో కూడిన ఈ ప్రక్రియ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటుందని ఆశిస్తున్నారు. ఇంటి స్థలం ఒక సామాన్య కుటుంబానికి ఆస్తి మాత్రమే కాదు, భద్రత, గౌరవం కూడా. ఈ పథకం ద్వారా అది సాకారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: