మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, రాజకీయాల్లో “బీటెక్ రవి”గా పేరుగాంచిన ఈ నేత, ప్రస్తుతం టీడీపీ లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా పూర్తి చేసి పార్టీకి గెలుపు తేవడంలో ఆయన ప్రత్యేకత ఉంది. 2017-18 మధ్యకాలం నుంచి ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన ప్రతి అవకాశం, పార్టీ బలం పెంచేలా మారింది. 2017-18లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించడానికి బీటెక్ రవి కీలక వ్యూహాలు అమలు చేశారు. ఆ గెలుపు అప్పట్లో టీడీపీకి ఊపును తెచ్చింది. తాజాగా జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన సతీమణికి అవకాశం రావడమే కాకుండా, పార్టీని గెలుపు దిశగా నడిపించడం ద్వారా ఆయన మళ్లీ తన రాజకీయ ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయాలకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా బహిరంగంగా ప్రశంసలు కురిపించారు.


పార్టీ వర్గాల ప్రకారం, బీటెక్ రవి తాజా విజ‌యం వెనుక మూడు ప్రధాన వ్యూహాలు ఉన్నాయి. కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి కంచు కోట. ముఖ్యంగా పులివెందుల ప్రాంతం విషయానికి వస్తే, అక్కడ టీడీపీకి విజయం సాధించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో రవి, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి, అందరినీ కలుపుకొని, స్థానిక నాయకులకు సరైన దిశానిర్దేశం ఇచ్చారు. ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు రాకుండా, సమష్టి కృషితో విజయం సాధించారు. రవి వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నా ఎప్పుడూ పార్టీ నిర్ణయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల వ్యూహాల నుంచి ప్రజలతో మాట్లాడే విధానం వరకు, పార్టీ లైన్ ప్రకారం వ్యవహరించారు. అదే సమయంలో ప్రజలకు పార్టీ విధానాలను సులభంగా, స్పష్టంగా వివరించగలిగారు.


ఎన్నికల సమయాల్లోనే కాదు, ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండడం రవి ప్రత్యేకత. గ్రామాల వారీగా పర్యటిస్తూ సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, ఇప్పుడు జడ్పీ ఎన్నికల్లోనూ ఈ అలవాటు ఆయనకు గెలుపు తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: