ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుండి 2024 మధ్య జగన్ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటిగా వైసీపీ ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేది 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. ప్రతి సభలోనూ, ప్రతి వేదికపైనూ జగన్, ఆయన మంత్రులు, పార్టీ నేతలు ఈ అంశాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ వచ్చారు. అయితే వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆ 17 కాలేజీల్లో గరిష్టంగా నాలుగైదు కాలేజీలకే నిర్మాణ‌ పనులు సగం దాటాయి. మిగతా చోట్ల పునాదులు వేయడమే తప్ప గణనీయమైన పనులు జరగలేదు. చాలా జిల్లాల్లో భూముల కేటాయింపే ప్రధాన కార్యక్రమంగా నిలిచిపోయింది. ఇప్పటికే పూర్తయిందని చెప్పే కొన్ని కాలేజీల్లో కూడా అవసరమైన సిబ్బంది, సౌకర్యాలు లేక సక్రమంగా తరగతులు జరగడంలేదని నివేదికలు చెబుతున్నాయి. అంటే, కాగితాలపై, సభల వేదికలపై మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగినా, ప్రజలకు ఉపయోగకరంగా మారినది చాలా తక్కువ.


అదీ కాకుండా, ఈ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు నిధులు విడుదల చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వల్ల పనులు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ అంశాన్ని విలేకరులు ఇటీవల ప్రెస్ మీట్లో జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు. దానికి ఆయన సమాధానంగా “ఏ భవనం ఒక రోజులో కట్టబడదు. ఎయిమ్స్ మంగళగిరి నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టింది. అలాంటపుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టడానికి సమయం పడటం సహజం కాదా?” అని వ్యాఖ్యానించారు.
జగన్ ఇచ్చిన ఈ ఉదాహరణలోనే అసలు సమస్య దాగి ఉంది. ఎయిమ్స్ వంటి భారీ సౌకర్యాల సముదాయం దశాబ్దాల కిందట, సాంకేతిక వనరులు తక్కువగా ఉన్న సమయంలో నిర్మించారు. ఇప్పుడు అయితే ఆధునిక టెక్నాలజీ, విస్తారమైన నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉన్నాయి. అలాంటపుడు ఒక సాధారణ మెడికల్ కాలేజీకి ఐదేళ్లు సరిపోవని వాదన అర్థం కాని మాట.


అసలు ఇది మరో కోణంలో చూసుకుంటే విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే, 2015లో అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు నాలుగేళ్లలో పూర్తి కాలేదని జగన్ సహా వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి 40 వేల కోట్లకు పైగా ఖర్చుచేసి పదుల సంఖ్యలో భవనాలు 80–90 శాతం పూర్తయ్యాయి. అయినా వాటిని ‘గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేవు’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో కొన్ని మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్లు కూడా సరిపోవని ఇప్పుడు జగన్ చెబుతుండటం, అమరావతి విషయంలో నాలుగేళ్లలో పూర్తి కాలేదని ఎద్దేవా చేసిన తీరు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. రాజకీయ అనుకూలతకు అనుగుణంగా లాజిక్ మార్చుకోవడం తప్ప, వాస్తవ పరిస్థితులకు సరిపడే సమాధానం ఆయన వద్ద లేదని ఈ ఘటన నిరూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: