ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక దెబ్బ తగులుతుంది. ఆ క్షణం నుంచే వారి జీవితం మారిపోతుంది. అలానే నరేంద్ర మోడీ గారి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన 75వ పుట్టినరోజును నేడు ఘనంగా జరుపుకుంటున్నారు. కేవలం భారత్‌లోని ప్రజలే కాకుండా దేశ విదేశాలలో ఉన్న ఆయన అభిమానులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా అంతటా ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతూ, ఆయురారోగ్యాలతో నిండిన దీర్ఘాయుష్షుతో జీవించాలంటూ కోరుకుంటున్నారు. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1950 సెప్టెంబర్ 17న వాద్‌నగర్‌లో జన్మించారు. ఆయన కుటుంబం చాలా సాధారణ స్థితిలో ఉందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ ఒక చిన్న టీ దుకాణం నడిపేవారు. కుటుంబ సమస్యల కారణంగా మోడీ గారు కూడా తన చదువుతో పాటు ఆ దుకాణంలో తండ్రికి సహాయం చేసేవారు. ఆరుగురు పిల్లల్లో ఆయన మూడో సంతానం.


సాధారణ కుటుంబంలో పెరిగిన అనుభవమే ఆయనలో కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని, సూటిగా మాట్లాడే అలవాటును, సాధారణ ప్రజలతో కలిసిపోయే స్వభావాన్ని పెంచిందని అందరూ చెబుతారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన జీవితంలోని ఒక టర్నింగ్ పాయింట్ గురించి ఒక చిన్న కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. నరేంద్ర మోడీ చిన్నప్పటి నుంచే ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏ పనైనా చేస్తే పూర్తి చేసి తీరేవారు. దేనికి భయపడేవారు కాదు. ఈ విషయాన్ని ఆయన అనేకసార్లు స్వయంగా చెప్పుకున్నారు. ముఖ్యంగా 2019లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాన్ని షేర్ చేశారు.



ఆయన మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచే నేను చాలా ధైర్యంగా ఉండేవాడిని. ఒకసారి కొలనులో ఈత కొడుతూ ఉండగా అక్కడ ఒక చిన్న ముసలిని గమనించాను. దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. కానీ నా తల్లి నన్ను చూసి గట్టిగా అరిచింది. ‘ఇది ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? వెంటనే బయట వదిలేయ్’ అంటూ నా మీద కోపంగా అరిచింది. చుట్టుపక్కల వారు కూడా నన్ను చూసి భయపడ్డారు. ఆ ముసలి నన్ను ఏదో చేసేస్తుందేమో అని వారు అనుకున్నారు. కానీ నాకు మాత్రం ఎలాంటి భయం కలగలేదు. ఆ సంఘటన ద్వారా ధైర్యంగా ముందుకు సాగాలని నేర్చుకున్నాను. అయితే నా తల్లి ఎందుకు అలా అరిచిందో ఆ తర్వాత అర్థమైంది. ఒకవైపు నా ధైర్యం, మరోవైపు ఆమె భయం – రెండూ నాకు స్పష్టమయ్యాయి. అప్పటినుంచి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవాలి, ఒకరికి సహాయం చేయాలి..నలుగురికి అండగా నిలవాలి..ఒకరికి హానీ చేయకూడదు అని తెలుసుకున్నాను. సాధ్యమైనప్పుడు సహాయం చేయాలి అన్న విలువలను నేర్చుకున్నాను” అని చెప్పారు.



మోడీ గారి ఈ చిన్ననాటి అనుభవం విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా మారింది. తమిళనాడులోని ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మొదటి తరగతి పిల్లల కోసం ఈ సంఘటనను పాఠం రూపంలో చేర్చింది. అలా ముసలితో జరిగిన ఆ చిన్న సంఘటననే మోడీ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కథను అభిమానులు మరొకసారి వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: