టీడీపీ లో గత ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు పార్టీలో సీనియర్ల - జూనియర్ల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ బలమైన స్థావరాలుగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు యువ రక్తాన్ని ముందుకు తెచ్చారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో కొత్త నాయకులు, వారసులు పోటీ చేసి విజయాలను సాధించారు. అయితే, ఈ నిర్ణయంతో ఆ ప్రాంతాల్లో సీనియర్ నాయకులు, జూనియర్ నాయకుల మధ్య వివాదాలు తీవ్రతరం అవుతున్నాయి.


సీనియర్ నాయకులు దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేసి, తమ సొంత ఖర్చుతో కార్యకలాపాలు నిర్వహించారు. ప్రజలతో మమేకమై, పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, చివరి నిమిషంలో టికెట్లు వారిని పక్కన పెట్టి కొత్తవారికి ఇవ్వడంతో, తమ భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళనలో పడ్డారు. "తదుపరి ఎన్నికల్లో కూడా జూనియర్లకే అవకాశం ఇస్తే, మాకు ఇక అవకాశం రాదా?" అనే సందేహం వారిలో పెరుగుతోంది. ఈ ఆవేదనను వ్యక్తం చేస్తూ చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కుల సమీకరణలు కూడా కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఒకే కులానికి చెందినవారే అయినా, ఆ కుల సంఘాల్లో చీలికలు తీసుకువచ్చి తమకనుకూలంగా వాతావరణం మార్చుకోవాలని జూనియర్లు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల అంతర్గతంగా విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి.


సీనియర్లు జూనియర్లపై విమర్శలు చేయడం, చర్చల ద్వారా వారిని బలహీనపరచాలని చూడడం, మరోవైపు జూనియర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాలు పార్టీ అగ్రనాయకుల దృష్టికి చేరినా, ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. గతంలో సీనియర్లకు పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, అమలులో మాత్రం నిర్లక్ష్యం కనిపించడంతో అసంతృప్తి పెరుగుతోంది. అందువల్ల ఇప్పుడు వారు మళ్లీ తమకు న్యాయం చేయాలని బహిరంగంగానే కోరుతున్నారు. ఈ సమస్యను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు, సీనియర్ల ఆవేదనకు ఎలాంటి పరిష్కారం చూపుతారు అన్నది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: