వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి మరోసారి న్యాయపోరాటం మొదలుపెట్టారు. నాంపల్లి సీబీఐ కోర్టులో ఆమె తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌లో చేసిన వ్యాఖ్యలు, విన్నపాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. తన తండ్రి హత్య వెనుక ఇంకా అసలు మాస్టర్‌మైండ్‌లు బయటపడలేదని, కేసు పూర్తిగా విచారణ జరగలేదని ఆమె స్పష్టం చేశారు. అందుకే ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని సునీత కోరారు. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆమె ఈ కొత్త పిటిషన్‌ను దాఖలు చేయడం రాజకీయంగానూ, న్యాయపరంగానూ హాట్ టాపిక్‌గా మారింది.

సునీత పిటిషన్‌లో చేసిన ప్రధాన ప్రస్తావన – మాజీ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించినది. ఆయన గతంలో సీబీఐ ఎదుట ఇచ్చిన సాక్ష్యంలో జగన్ నివాసంలో జరిగిన సమావేశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. అదే రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జగన్ నివాసంలో తాను సమావేశమయ్యానని, కాసేపటి తర్వాత జగన్ “చిన్నాన్న ఇక లేరు” అని చెప్పినట్లు అజేయ కల్లం సీబీఐకి వెల్లడించారని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ స్టేట్‌మెంట్‌తో వివేకా మరణం జరిగిన సమయం, సమాచారం ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా వైఎస్ భారతి పేరు ఈ సందర్భంలో పరోక్షంగా ప్రస్తావనకు రావడంతో కేసు మరింత సెన్సేషన్‌గా మారింది.

ఇక మరో కీలక అంశం – ఐదో నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, కడప జైలులో ఉన్న అప్రూవర్ దస్తగిరిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ఇప్పుడు సీబీఐ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో, తదుపరి విచారణ ఏ దిశగా సాగుతుందో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు కుటుంబ అంతర్గత వివాదంగా కనిపించిన ఈ హత్యకేసు ఇప్పుడు మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: