ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా ఒక ఆసక్తికర మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విమర్శల బాణాలు అధికార వైసీపీ వైపు కాకుండా కూటమి ప్రభుత్వం వైపు ఎక్కువగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఖరి అందరినీ ఆలోచనలో పడేస్తోంది. గతంలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన షర్మిల, ఇప్పుడు మాత్రం జగన్ పేరు కూడా అరుదుగా తీసుకుంటున్నారు. ఆమె మీడియా ఇంటరాక్షన్లు తగ్గించడమే కాకుండా సోషల్ మీడియా ట్వీట్లు కూడా తగ్గిన సంగతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ దృష్టిలో ఏపీ కూటమి స్థానం స్పష్టమైంది .. ఇక జాతీయ స్థాయిలో చూస్తే, ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన భాగస్వామ్యమని స్పష్టమైంది. రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఇదే కూటమి కొనసాగనుందనే సంకేతాలు పైస్థాయిలోనుంచే వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర స్థాయి నాయకత్వం, క్యాడర్ వరకు చేరవేయడం ద్వారా భవిష్యత్ రాజకీయ గందరగోళాన్ని నివారించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏపీలో కూటమి బలపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్త మార్గం వెతుకుతోంది.


కాంగ్రెస్ వ్యూహం – వైసీపీతో సాఫ్ట్ పొలిటిక్స్? .. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దక్షిణ రాష్ట్రాల్లో బలపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఏపీలో ప్రత్యక్ష బలం తక్కువైనా, జాతీయ స్థాయిలో “ఇండియా కూటమి”ని బలోపేతం చేయాలనే దృష్టితో వైసీపీతో వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని అనుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో కలసి దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఏపీలో కూడా అదే దిశగా కదులుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక వైసీపీ విషయానికొస్తే, జగన్ ఓటు బ్యాంక్ ఇప్పటికీ 40 శాతం పైగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజా ఆదరణ నిలకడగానే ఉండటంతో, కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీని నేరుగా దూకి విమర్శించే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల మౌనం కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమనే భావన బలపడుతోంది.



బీహార్ ఫలితాలపై కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడుతోంది .. ఇక కాంగ్రెస్ పార్టీకి బీహార్ రాష్ట్రం కీలక మలుపు కాబోతోంది. అక్కడ “మహాఘట్ బంధన్” విజయం సాధిస్తే, జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి ఊపిరి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు నమ్ముతున్నారు. ఆ ప్రభావం దక్షిణ రాష్ట్రాలపై, ముఖ్యంగా ఏపీలో కూడా పడుతుందని లెక్క వేస్తున్నారు. వైసీపీకి 2029 ఎన్నికలు చావో రేవో .. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన మరణ ప్రశ్నగా మారబోతున్నాయి. జగన్ నేతృత్వంలో పార్టీ మరోసారి రాణించగలదా లేదా అన్నది అదే ఎన్నిక తేలుస్తుంది. ఇక కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం, కూటమి దూకుడు, జాతీయ రాజకీయ పరిణామాలు — ఇవన్నీ కలిపి ఏపీ రాజకీయ దిశను మార్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: