జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. ప్రచారం ముగియడంతో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు “ పోల్ మేనేజ్‌మెంట్ ” పై దృష్టి సారించాయి. సాధారణంగా ఈ దశలో అధికార పార్టీకి కొంత ముందస్తు ఆధిక్యం ఉంటుంది. అయితే ఈసారి బీఆర్ఎస్ కూడా వెనుకడుగు వేయకుండా, తాను మళ్లీ బలంగా నిలబడగలదనే నమ్మకంతో పోరాటరంగంలోకి దూకింది. బీజేపీ మాత్రం ఈ ఉపఎన్నికను పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం తమపై పెద్దగా ప్రభావం చూపదని భావించి తేలికగా తీసుకున్నట్లుంది. కానీ అసలు పోటీ మాత్రం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యే జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ పెద్దలు మొత్తం శక్తిని ఈ నియోజకవర్గంపై కేంద్రీకరించారు. గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశారు. తమకు ప్రభుత్వం లేకపోవడంతో ప్రజల్లో “ ఎందుకు బీఆర్ఎస్‌కి ఓటు వేయాలి ? ” అనే సందేహం రాకుండా ప్రత్యేక ప్రచార వ్యూహం రచించారు.


కాంగ్రెస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయి, బుల్డోజర్లు వస్తాయి ” అంటూ భయాన్ని సృష్టించేలా ప్రచారం చేశారు. కేటీఆర్ స్వయంగా సమన్వయం చేస్తూ మాగంటి సునీతను కేవలం అభ్యర్థిగా కాకుండా “పార్టీ ప్రతిష్ట”గా ప్రొజెక్ట్ చేశారు. ఇది బీఆర్ఎస్‌కి జీవ‌న్మ‌ర‌ణ‌ పోరాటం లాంటి ఎన్నిక‌. కంటోన్మెంట్ ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన పార్టీకి, జూబ్లీహిల్స్‌లో ఓటమి అంటే పునాదులే కదిలినట్టే. అందుకే గెలుపే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని సర్వశక్తులు వినియోగించారు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే, ఈ ఉపఎన్నిక రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో నేరుగా ముడిపడి ఉంది. ఆయన నేతృత్వం బలంగా నిలవాలంటే గెలుపు తప్పనిసరి. ఓటమి వస్తే పార్టీ సీనియర్ నేతలు మళ్లీ హైకమాండ్ చెంతకు వెళ్లి రేవంత్ ను ప‌ద‌వి నుంచి దించేయాల‌ని ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అంతర్గత విభేదాలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ ఈ ఎన్నికలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని తానే స్వయంగా ప్రచార రంగంలోకి దిగారు.


బీజేపీ మాత్రం ఈసారి “సైలెంట్ గేమ్” ఆడింది. బలమైన అభ్యర్థిని పెట్టే అవకాశం ఉన్నప్పటికీ, సావధానంగా వ్యవహరించింది. బండి సంజయ్ వంటి నాయకుల దూకుడు తగ్గించి, ప్రచారాన్ని నియంత్రించింది. తాము గెలవకపోయినా, ఫలితాల్లో ఇతరులకు నష్టం జరిగేలా రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉందని చెప్పాలి. బీఆర్ఎస్ గెలిస్తే త‌మ‌కు తిరుగులేద‌ని దూకుడుగా ప్ర‌జ‌ల్లోకి వెళుతుంది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ స్థానం మరింత బలపడుతుంది. ఏ ఫలితం వచ్చినా, ఇది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మలిచే కీలక ఎన్నికగా నిలవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: