బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది. ఉదయం మొదటి రౌండ్‌ నుంచి కౌంటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఎక్కడ చూసినా ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలోనే దూసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ పోటీ చూపించినప్పటికీ ఫలితాలు బయటకు వస్తున్నకొద్దీ ఎన్డీయే ఆధిక్యం మరింత బలపడుతూ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు స్పష్టమైన తీర్పుతో ఎన్డీయే ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారు.ఈ అద్భుత విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, బీహార్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “సుపరిపాలన గెలిచింది. అభివృద్ధి గెలిచింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి గెలిచింది. సామాజిక న్యాయం గెలిచింది. బీహార్ ప్రజలు మా పరిపాలనపై ఉంచిన విశ్వాసానికే ఈ తీరని విజయమే నిదర్శనం” అని అన్నారు.


2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు లభించిన ఈ అఖండ మెజారిటీ తమ ప్రభుత్వానికే కాకుండా దేశ ప్రజాస్వామ్యానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు. “బీహార్‌లోని నా కుటుంబ సభ్యులంతా మమ్మల్ని అఖండ ఆశీర్వాదాలతో కౌగిలించుకున్నారు. వారి ప్రేమకు, విశ్వాసానికి నేను చాలా కృతజ్ఞుడిని. ఈ తీర్పు బీహార్ కోసం మరింత శక్తితో, మరింత నిబద్ధతతో పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తోంది” అని పోస్ట్ లో రాసుకొచ్చారు. అదే సమయంలో, ఎన్డీయే భాగస్వాముల పాత్రను ప్రశంసిస్తూ, “మా ట్రాక్ రికార్డ్‌ను, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే మా దార్శనికతను ప్రజలు గుర్తించారు.

 

అందుకే మాకు అఖండ మెజారిటీని అందించారు. ఈ అపూర్వ విజయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌గారిని, ఎన్డీయే భాగస్వాములు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు బయటకు రావడంతో ఎన్డీయే శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా, ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు నాయకుల్లో మరింత ఉత్సాహం నింపాయి. ప్రజలు ఇచ్చిన ప్రతి ఓటు తమ బాధ్యతను మరింత పెంచిందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రతి రోజూ కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: