జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వచ్చిన ఫలితం కాంగ్రెస్‌కు అనుకూలంగా వ‌చ్చింది. ఈ ఎన్నికలో పార్టీల కంటే కూడా సెంటిమెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న అంచనాలు మొదటి రోజు నుంచే వినిపించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఉపఎన్నిక కావడంతో బీఆర్‌ఎస్ మూడు రకాల సెంటిమెంట్లపై నమ్మకంగా ప్రచారం సాగించింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా రెండు రకాల సెంటిమెంటు రాజకీయాలతో ముందుకొచ్చింది. అయితే చివరికి ఏ సెంటిమెంట్ పనిచేసింది? ఏది పనిచేయలేదు? అన్నది ఇప్పుడు చర్చకు వ‌స్తోంది. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మాగంటి సునీత మొదటగా భర్త గోపీనాథ్ మరణం నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నిక కాబట్టి సానుభూతి ఓట్లు తమవైపు మొగ్గుతాయని భావించారు. ప్రచారం ప్రారంభ రోజే ఆయన ఫొటోలు పట్టుకుని సభల్లో భావోద్వేగానికి లోనవడం ద్వారా ఈ సెంటిమెంట్‌ను బలంగా ప్రదర్శించారు.


రెండో సెంటిమెంట్‌గా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గత పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు. మూడో సెంటిమెంట్‌గా మాగంటి కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న వ్యవస్థాగత ఓటు బ్యాంక్‌ను నమ్ముకున్నారు. ఈ మూడు సెంటిమెంట్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోయినా పోటీలో మాగంటి సునీత బలహీనంగా కనబడలేదు. కొన్ని ప్రాంతాల వ‌ర‌కు గ‌ట్టిపోటీయే ఇచ్చారు. లేక‌పోతే కాంగ్రెస్ మెజార్టీ ఇంకా పెరిగిపోయేది ఉండేది. మరోవైపు కాంగ్రెస్ రెండు ప్రధాన సెంటిమెంట్లతో ప్రచారం సాగించింది. మొదటిది ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి ప్రయోజనాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు.


ఏదేమైనా అమలు కాకుండా ఉన్న గ్యారెంటీలపై ప్రజలు ప్రశ్నించినా, ప్రభుత్వ పథకాలు ఇచ్చిన నమ్మకంతో ముందుకు సాగారు. రెండో సెంటిమెంట్‌గా న‌వీన్ యాదవ్ వరుస పరాజయాలపై ప్రజలతో ఓపెన్‌గా మాట్లాడారు. 2014 నుండి ఎన్నిసార్లు పోటీ చేసినా ఓటమి పాలయ్యానని, ఈసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలనే భావోద్వేగాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఇది ఓటర్లను బాగా ఆక‌ట్టుకుంద‌ని విశ్లేషకులు చెబుతున్నారు.
చివరి మూడు రోజుల ప్రచారం ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసిందని అంచనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్ రంగంలోకి దిగడం, బలమైన మాట‌ల‌తో బీజేపీ–బీఆర్‌ఎస్‌లపై దాడి చేయడం, మంత్రుల బృందం సమన్వయంతో పనిచేయడం ఇవ‌న్నీ న‌వీన్ యాద‌వ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి.


ఇక బీఆర్‌ఎస్ వైపు చూసితే… మాగంటి సునీత కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా ఆమె సొసైటీ వివాదాలు,  ఆమె బావ వ‌జ్ర‌నాథ్‌, ఆమె అత్త‌ మాగంటి మహాదేవి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో నెగటివ్ ఇంపాక్ట్ కలిగించాయని పరిశీలకుల అభిప్రాయం. ఇవన్నీ కలిపి ఆమె ఓటమికి కారణమయ్యాయి. మొత్తం చూస్తే… సెంటిమెంట్ రాజకీయాలు రెండు పార్టీల్లోనూ ఉన్నా, ప్రజలు చివరికి స్పష్టత, నాయకత్వం, మరియు సమన్వయంతో సాగిన ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: