ఉత్తరాది ప్రజలు బయటికి అడుగుపెట్టాలంటే తెగ భయపడిపోతున్నారు. తలుపు తెరిస్తే చాలు.. దట్టంగా కమ్మేసిన కాలుష్యాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో ఆక్సిజన్ శాతం పడిపోగా.. విషవాయులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. చాలామంది ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇక వృద్దులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. ఎందుకంటే వాళ్లలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఎయిర్ పొల్యూషన్ తో లేనిపోని అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. దీపావళి తర్వాత ఉత్తరాదిన ఈ పరిస్థితి దాపురించింది.
అటు ఢిల్లీ, హర్యానాలోనూ వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఆందోళన చెందిన ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానంలో వాహనాలకు అనుమతి ఇచ్చింది. వీఐపీలు మినహా రూల్స్ అతిక్రమించిన సాధారణ వాహనదారులపై ఫైన్ ల మోత మోగించింది. ఇటీవల కొద్ది పాటి వర్షం పడినా.. వాతావరణంలో ఎలాంటి మార్పు రాలేదు. వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి చెట్లను నీటితో తడిపినా ప్రయోజనం లేకుండా పోయింది.