టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 13 ఇన్నింగ్స్‌ల్లో 25కు పైగా పరుగులు చేసిన మొదటి ఆసియా ఆటగాడిగా సూర్య అరుదైన ఘనత సాధించాడు. దీంతో సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా రికార్డును సమం చేశాడు. బుధవారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచి తన సత్తాను మరోసారి నిరూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సూర్య 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి, మ్యాచ్‌ను ముంబై గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 583 పరుగులతో టాప్-3 రన్‌ రేట్ లో కొనసాగుతున్నాడు.

టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా 25కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ టాప్ స్థానంలో ఉన్నాడు. అతను వరుసగా 13 ఇన్నింగ్సుల్లో 25కిపైగా పరుగులు చేసి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇదే ఫీట్‌ను దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా కూడా సాధించిన సంగతి తెలిసిందే. ఇక వీరి తర్వాత జాబితాలో బ్రాడ్ హాడ్జ్, జాక్వెస్ రుడాల్ఫ్, కుమార సంగక్కర, క్రిస్ లిన్‌లు వరుసగా 11 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. టీ20 ఫార్మాట్‌లో నిలకడగా ఆడిన ఆటగాళ్లలో వీరు ప్రముఖంగా నిలిచారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఆసియా నుండి ఈ ఫీట్‌ను సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకు ఎక్కాడు.

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నేఖిల్ నాయర్ (29), హార్థిక్ పాండ్యా (22)గా నిలిచారు.ఇక ఢిల్లీ బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పూర్తిగా తడబడింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ చెరో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వీ (39), విప్రజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సమతుల్య ప్రదర్శనతో ముంబై విజయం సాధించగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: