ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. దీంతో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలపై మోజు పెంచుకుంటున్నారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారిస్తోంది. తాజాగా ప్రముఖ దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్ టూ వీలర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ధరతో వచ్చిన ఈ బైక్ దిమ్మతిరిగిపోయే మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంకెందుకాలస్యం ఆ స్కూటర్ విశేషాలేంటో చూసేద్దామా... గెట్ రెడీ..!

హీరో ఆటోమొబైల్స్ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,540. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చని హీరో సంస్థ చెబుతోంది. ఇందులో ఆప్టిమా హెచ్ ఎక్స్, నిక్స్ హెచ్ ఎక్స్, ఫోటాన్ హెచ్ ఎక్స్ అనే 3 మోడల్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. వీటిని మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే పొడవుగా, కొత్త డిజైన్‌తో తయారు చేసినట్లు చెప్పింది. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా వీటిని తయారు చేశామని, స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.

ఈ స్కూటర్లలో మోడల్‌ను బట్టి మైలేజ్ మారుతుందని, ఒకసారి చార్జ్ చేస్తే ప్రారంభ మోడల్ 82 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో నిక్స్ హెచ్ ఎక్స్ గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుందని తెలిపింది. ‘హెచ్ ఎక్స్‌కు డిజిటల్ స్పీడోమీటర్ అమర్చాం. వెనక రైడర్‌కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్ హోల్డర్ ఉంది. దీనికి 1.536 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నా’మని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది.

కాగా.. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే డౌన్ పేమెంట్ రూ.4999 చెల్లించి తీసుకోవచ్చని తెలిపింది. వడ్డీ రేటు రూ.6.99 మాత్రమేనని, పూర్తీ వివరాల కోసం హీరో ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్‌ను కానీ, దగ్గరలోని హీరో బైక్ షోరూంలో కానీ సంప్రదించవచ్చని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: