ఒకరికి తెలియకుండా మరొకరిని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది ఆ యువతి. అంతేకాదండోయ్ మూడుముళ్ల పేరు చెప్పి ఇక ముగ్గురుని కూడా నట్టేట ముంచేసింది. ఏపీ లోని కర్నూలు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల మండలం మీట్నాల గ్రామానికి చెందిన మేరమ్మ కుమార్తె శిరీష కు కొంతకాలం క్రితమే అవుకు మండలం కి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి తో పెళ్లి జరిగింది. కొన్నాళ్ళకే భర్త నుంచి దూరంగా వచ్చేసింది విడాకులు ఇవ్వకుండానే ఆత్మకూరు మండలం కొత్తపల్లి కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత బేతంచెర్ల మండలం రంగాపురం కు చెందిన మహేశ్వర్ రెడ్డినీ మూడో పెళ్లి చేసుకుంది.
ఇక ఇలా పెళ్లి చేసుకోవడమే కాదు ఏకంగా భర్తలకు కండిషన్ పెట్టి బ్యాంకు లో లక్ష రూపాయలు డిపాజిట్ చేయించుకుంది శిరీష. తల్లి మేరమ్మ కూడా నా కూతురిని మీ ఇంటికి పంపించాలంటే డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తూ ఉండేది. దీంతో అనుమానం వచ్చిన మహేశ్వర్ రెడ్డి శిరీష గురించి ఆరా తీయగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసులు శిరీష అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని నిజాలు బయటపడ్డాయి. వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న శిరీషా దాదాపు యాభై లక్షలకు పైగా నగదు వారి నుంచి తీసుకుంది అన్న విషయం తేలింది..