కరోనా సెకండ్ వేవ్‌ ప్రధాని మోడీ ఇమేజ్‌ను చాలా వరకూ మసకబార్చింది. కరోనా సెకండ్ వేవ్‌కు కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్యమేనన్న అభిప్రాయం చాలా చోట్ల వినిపించింది. ప్రత్యేకించి కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్నారని .. కుంభమేళా వంటి రద్దీ కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇచ్చారని.. కరోనా మూడో వేవ్‌ కు ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. మన దేశంలోనే రెండు సంస్థల వ్యాక్సిన్లు తయారవుతున్నా..వాటిని భారతీయులకు అందించకుండా.. విదేశాలకు పంచారన్న విమర్శలూ ఉన్నాయి.


అంతేనా.. ఆక్సిజన్ కొరతను అసలు అంచనా వేయలేదని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి సెకండ్ వేవ్ కథ ముగిసి ఇప్పుడు మూడో వేవ్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ దశలో మరోసారి విమర్శల పాలు కాకుండా కేంద్రం కాస్త జాగ్రత్తలు తీసుకుంటోంది. కొవిడ్‌ మూడోముప్పు పొంచి ఉందన్న వార్తల మధ్య దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మోడీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.


కరోనా మూడో వేవ్ వచ్చినా ఇబ్బంది పడకుండా కనీసం 30 రోజులకు సరిపడా వైద్యసామగ్రిని నిల్వ చేస్తోంది. ఈ నిల్వ కార్యక్రమంలో భాగంగా కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్, ఫావిపిరవిర్ వంటి ఔషధాలను సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం. అంతే కాదు.. కరోనా కట్టడికి, చికిత్సకు కీలకమైన పారాసెటమాల్, యాంటీబయోటిక్స్, విటమిన్‌ మాత్రలు కూడా కేంద్రం భారీగా నిల్వ చేసుకుంటోందట. మూడో ముప్పు అంటూ వస్తే.. అవసరం వస్తాయని.. ఐదు మిలియన్ల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను కూడా కేంద్రం రప్పించుకుంటోంది.


ఇక మూడో వేవ్‌.. ఆగస్టు చివరినాటికి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే.. రెండో వేవ్‌ అంత తీవ్రంగా మూడో వేవ్ ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఎందుకైనా మంచిదని కేంద్రం ఈసారి గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే అసలు థర్డ్ వేవ్ అంటూ వస్తే కానీ తెలియదు.. ప్రభుత్వం ఎంత సిద్ధంగా ఉందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: