తెలంగాణాలో ఈ వారం అంతా ఎన్నికల హడావుడి కొనసాగింది. ప్రభుత్వ మార్పుతో రాష్ట్రమంతా ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత పదేళ్లుగా ఉన్న ప్రభుత్వం మారడంతో ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ పదవుల్లో , హోదాల్లో ఉన్నవారికి షాక్ తగిలినట్లయింది. మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని భావించిన వారందరికీ అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఒక్కసారిగా సోమవారం రాజీనామాల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు.


అయితే రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం అని చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ బంధువైన సీఎండీ ప్రభాకర్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వారిని కేసీఆర్ నామినేటిడ్  పోస్టుల్లో నియమించారు. వీరికి నెలకు రూ.లక్ష చొప్పున జీతం, ప్రత్యేక ఛాంబర్లు, వాహనాలు సిబ్బంది వంటి వాటిని సమకూర్చారు. అయితే వీరంతా కేసీఆర్ నిర్ణయం మేరకు తమ పదవులకు రాజీనామాలు చేశారు.


ఇదే పరిస్థితి గతంలో టీడీపీ కి ఎదురైనప్పుడు కార్పొరేషన్, నామినేటిడ్ పోస్టులకు ఆ పార్టీ నాయకులు రాజీనామా చేయలేదు. దీనిపై వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. సగానికి పైగా టీడీపీ నేతలు తమ పదవీ కాలం పూర్తయే వరకు వారి పదవుల్లో కొనసాగారు. అదే తెలంగాణ విషయానికొస్తే బాధ్యతాయుతంగా స్పందించి రాజీనామాలు చేశారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


రాజీనామా చేసిన వారిలో ప్రముఖంగా ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్, బ్రాహ్మాణ పరిషత్ ఛైర్మన్ రమాణాచారి తదితరులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తమ రాజీనామా ప్రతులను సీఎస్ శాంతికుమారికి, సీఎండీ ప్రభాకర్ రావు రాష్ట్ర విద్యుత్తు ప్రధాన  కార్యదర్శికి పంపించారు. ప్రస్తుతం రాజీనామా చేసిన కార్పొరేషన్ ఛైర్మన్లో కొంతమందికి ఏడాది, మరొకొంత మందికి కొన్ని నెలల సమయం మాత్రమే పదవీ కాలం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: