రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి కష్టాన్ని తగ్గించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఐదు కీలక సూత్రాలతో కూడిన పంచసూత్ర ప్రణాళికను చంద్రబాబు ప్రకటించారు. ఇటీవలి కాలంలో కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో జరిగిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సభలో చంద్రబాబు ఈ పంచసూత్రాలను వివరంగా తెలియజేశారు. వీటి అమలు ద్వారా రైతులకు నష్టాలు రాకుండా, మరిన్ని లాభాలు చేకూరే మార్గాలను ప్రభుత్వం సిద్దం చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతు దిగుబడిని మార్కెట్లో ఎవరో కొనుగోలు చేసే వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులు తొలగించడం కోసం రైతులే ప్రత్యక్షంగా విక్రయం చేసే విధానాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. రైతు శ్రేయస్సు కోసం రూపొందించిన ఈ పంచసూత్రాలు వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒక్క కార్యక్రమాన్ని ప్రకటించడమే కాకుండా, ఆ సూత్రాలు అమల్లో ఎలా ఫలితాలివ్వాలి అన్న దానిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ లక్ష్యంతోనే ఈ నెల 24 నుంచి “ రైతన్నా… మీ కోసం ” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి సమస్యలు వినడం, అవసరాలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడం చేపడతారు. వీటి ద్వారా రైతులు–ప్రభుత్వం మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ, చంద్రబాబు పట్ల రైతుల్లో సానుభూతిని, నమ్మకాన్ని పెంపొందించాలనే వ్యూహం పార్టీ రూపొందించింది. మరి ఈ కొత్త ప్రయత్నాలు, వ్యూహాలు రైతుల మనసును గెలుస్తాయా ? రైతులు - చంద్రబాబు మధ్య ఉన్న గ్యాప్ నిజంగా తగ్గుతుందా ? రాబోయే రోజుల్లో తేలిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి