ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది తాజాగా చర్చకు వస్తున్న ప్రధాన అంశం. పలు టీవీ చర్చల్లో మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయంపై స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. దీంతో.. వాస్తవానికి ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ ప్రణామాలు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య జరుగుతున్న చర్చ వంటివి పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే మళ్లీ ఎవరు గెలుస్తారు?. అనేది ఆస‌క్తిగా మారింది.


అంతేకాదు.. ఎవరు అధికారంలోకి వస్తారు అనేది రాష్ట్రంలో తాజాగా తెరమీదకు వచ్చిన కీలక వ్యవహారం. అయితే.. ఒకళ్ళిద్దరు తప్పు చేసినంత మాత్రాన కూట‌మి ప్రభుత్వానికి పూర్తిగా డామేజ్ అవుతుందా? అనేది ఇక్కడ ప్రధాన అంశం. ఇటీవల కాలంలో వరుస వివాదాలతో కొంతమంది ఎమ్మెల్యేలు రోడ్డున పడ్డ విషయం అందరికీ తెలిసిందే. అటు జనసేనలోనూ ఇటు టిడిపిలోను ఈ తరహా నాయకుల కారణంగా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.


దీనిని ప్రామాణికంగా తీసుకుని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపి గెలుస్తుందా అనే చర్చ సరైనది కాకపోయినా ప్రస్తుతం అయితే అదే జరుగుతోంది. కానీ, కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడం, రాష్ట్రంలో పెట్టుబడులు.. అదేవిధంగా సుపరిపాలన వంటి అంశాలను ప్రభుత్వం కీలకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ తరహా చర్చకు అవకాశం లేదన్నది మరికొందరు చెబుతున్న మాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మరోసారి కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి.


దీనికి ప్రధానంగా సంక్షేమ పథకాలు, బలమైన ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం, కేంద్రంతో మెరుగైన సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా జరుగుతున్న లబ్ధి ఇప్పుడు రాష్ట్ర ప్రజల మధ్య ఎక్కువగా సానుకూల పరిణామాలను ఏర్పడేలా చేసింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగితే ప్రభుత్వం అయితే మారిపోయే పరిస్థితి లేదని మెజారిటీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాకపోతే వైసిపి కొన్ని కొన్ని చోట్ల పుంజుకునే అవకాశం ఉంటుందన్నది వారు చెబుతున్న మాట‌. ఇంత‌కు మించి ఇప్ప‌టికిప్పుడు భారీ మార్పులు రాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: