ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు - దర్శకుల కాంబినేషన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి కాంబోలో యువరత్న నందమూరి బాలకృష్ణ - సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులు బ్రేక్ అయిపోయాయి. ముందుగా వీరిద్దరి కాంబోలో బాలయ్య - విజయశాంతి జంటగా వచ్చిన లారీ డ్రైవర్ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పట్లోనే రజతోత్సవాలు జరుపుకుంది. ఆ తర్వాత మళ్లీ వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అయితే 200 రోజులు.. 300 రోజులు ఆడి మళ్లీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కూడా విజయశాంతి హీరోయిన్.
ఇక మూడో సారి వీరి కాంబోలో వచ్చిన సమరసింహా రెడ్డి సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఏకంగా సంవత్సరం రోజులు ఆడింది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులు అన్నింటిని తిరగ రాసింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. రాయలసీమ ఫ్యాక్షనిజంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు పోటీగా వచ్చిన చిరంజీవి స్నేహంకోసం తేలిపోయింది. 1999 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఇక 2001 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహా నాయుడు సినిమా సైతం అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులకు పాతరేసింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా అప్పట్లో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. దక్షిణాదిలో ఒక సినిమా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం నరసింహా నాయుడే తొలి సినిమా అయ్యింది. ఈ సినిమాలో సిమ్రాన్, ప్రితీ జింగానియా, ఆశా షైనీ హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ + ఫ్యాక్షన్తో వచ్చిన ఈ సినిమాకు పోటీగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవీపుత్రుడు వచ్చి అట్టర్ ప్లాప్ అయ్యాయి.
ఇలా బాలయ్య - బి.గోపాల్ సినిమా వస్తుందంటే అసలు బాక్సాఫీస్ దగ్గర పోటీయే ఉండేది కాదు. రికార్డులు అన్ని చిత్తయ్యి పోయేవి. అయితే వీరి కాంబోలో చివరిగా 2003లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు వీరి కాంబోలో సినిమా వస్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.