వైసీపీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. కొందరు టీడీపీ నేతలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రారంభించిన తెలుగు దేశం పై దాడి వ్యవహారం మరింత వేడి రగిల్చింది. అందులో భాగంగానే ఇప్పుడు కొడాలి నాని ఓ రేంజ్ లో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
సన్నబియ్యం ఇస్తామని టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా మాట్లాడుతూ..సన్యాసి సన్నబియ్యం ఇస్తానని చెప్పాడని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తాను ఎవరికి చెప్పానని ఉమాను ప్రశ్నించారు. నాణ్యమైన బియ్యం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించినట్లు కొడాలి నాని గుర్తు చేశారు. నాణ్యమైన బియ్యం ఇవ్వాలంటే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
మేం అధికారంలోకి వచ్చింది మే 30న అన్నారు. ఈ నెలాఖరుకు వరి పంట రైతుల చేతికి వస్తుందని తెలిపారు. వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి నాణ్యమైన బియ్యం ఇస్తామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నట్లు తెలిపారు. మా వద్ద రిసైక్లింగ్ చేసిన బియ్యం ఉందని, ఈ బియ్యం తినేందుకు పనికిరాదన్నారు. వాటిలో మంచి బియ్యాన్ని ప్రజలకు అందజేస్తుంటే ఈ వెధవలు చంద్రబాబు, దేవినేని ఉమా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. దేవినేని ఉమా తన అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చాడని, వదిన అడ్డుపడితే ఆమెను కూడా చంపారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందని, మా నాయకుడు చిటికేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీ పార్టీ సంక్షోభానికి లోకేష్ కారణమని, దాన్ని సరిచేసుకోలేక మా నాయకుడు వైయస్ జగన్పై విమర్శలు చేస్తున్నారని, ఇలాగే ప్రవర్తిస్తే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. వైయస్ జగన్పై టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలను కొడాలి నాని ఘాటుగా తిప్పికొట్టారు.