భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఇల్లెందు మునిసిపల్ రాజకీయం.. రసవత్తరంగా మారింది. ఇక్కడ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కంటే.. సొంత పార్టీ నుంచే ముప్పు కనిపిస్తోంది. ఇక ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ వర్గీయులకే టికెట్లు దక్కాయి. దీంతో మాజీ మునిసిపల్ చైర్మన్ మడత రమ వర్గీయులు రెబల్స్గా బరిలో నిలిచారు. అందుకే మిగిలిన పార్టీ సంగతి పక్కకు పెట్టి ఇక్కడ సొంత పార్టీలోనే టీఆర్ఎస్ కుమ్ములాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇల్లందులో టీఆర్ఎస్, రెబల్ అభ్యర్థులకు మధ్యే ఎక్కువ చోట్ల పోటీ నడుస్తోంది. ఈ రెండు గ్రూపులనూ సమన్వయం చేయాలని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు విఫలం కాడవంతో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తి కరంగా మారింది. ఇల్లెందు పురపాలక సంఘం పరిధిలో తాజా మాజీ ఛైర్పర్సన్ మడత రమ, ఆమె భర్త వెంకటగౌడ్కు తెరాస టికెట్ దక్కలేదు.
దీంతో ఆమె వర్గం తెరాస రెబల్స్గా బరిలో దిగింది. పలు విధాలుగా సంప్రదింపులు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ 24 వార్డులకు 156 మంది పోటీ పడుతున్నారు. స్థానికంగా పొత్తులు కూడా సెట్ కాలేదు. 3, 21 వార్డుల్లోని టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.
అయితే.. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లందులో టిఆర్ఎస్ జండా ఎగురవేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల పార్టీ నేతలతో చెప్పారు. పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి ఇల్లందుకు వచ్చినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. మున్సిపల్ పరిధిలోని 24 ఓట్లను టిఆర్ఎస్ కైవసం చేసుకొనేలా కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇల్లందును గెలిపిస్తే.. ఇల్లందు బస్ డిపో కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లందు నియోజక వర్గ అభివృద్ధి కొరకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మరి మంత్రి కోరిక తీరుతుందా..?