వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి వైజాగ్ మేయర్ పీఠంపై కన్నేశారా..ఎలాగైనా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారా..అంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్న టి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క విశాఖ జిల్లాలో టీడీపీకి కాస్త ఊరట లభించింది. కాస్తో కూస్తో అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అందుకే స్థానిక ఎన్నికల్లో టీడీపీని తుడిచిపెట్టేయాలని వైసీపీ వ్యూహాలు పన్నుతోంది.

 

అందులోనూ ఉత్తరాంధ్రకు స్థానిక ఎన్నికల ఇన్ చార్జ్ గా విజయసాయి రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఇప్పటికే జోరు మీద ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఆదివారం విజయసాయిరెడ్డి విశాఖలో పర్యటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకుండా ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని కార్యకర్తలకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

 

 

ఈసారి టీడీపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు టీడీపీని ఓడించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విధంగా త్వరలోనే విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతున్న తరుణంగా మేయర్‌ పీఠాన్ని ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీ గెలవాల్సిన అవసరముందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

 

 

విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ప్రకటించడం చరిత్రాత్మకం అని సీఎం నిర్ణయంపై విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. పద్దతులు, పరిమితులు ప్రకారం ఎన్నికల్లో సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. పార్టీ నిర్ణయానికి లోబడి పనిచేసే వ్యక్తులకు మాత్రమే సీట్లు కేటాయిస్తాని విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు సీఎం జగన్‌ ఖచ్చితంగా న్యాయం చేస్తారని విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: