దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో వేలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి. కరోనా మహమ్మారి వల్ల ఘనంగా పెళ్లిళ్లు జరుపుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇకపై హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
పెద్దవారైనా, పేదవారైనా అందరూ ఒకే విధంగా పెళ్లి వేడుక జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకనుంచి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం వివాహాలకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అనంతరం రెవిన్యూ అధికారులు వివాహ వేడుక ప్రాంతాన్ని పరిశీలిస్తారు. వరుడు, వధువు తరపున ఎంతమంది వివాహానికి హాజరవుతారో ముందుగానే తెలపాలి. 
 
ఊరేగింపులు, బహిరంగ వేడుకలు, సాముహిక విందులు నిర్వహించబోమని సంతకం చేసి ఇవ్వాలి. అధికారులు కరోనా కట్టడి అయితే మాత్రమే నిబంధనల్లో మార్పులు చేస్తామని ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 62939కు చేరింది. ఇప్పటివరకు 2109 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 19,358 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1980కు చేరగా మృతుల సంఖ్య 45కు చేరింది. రాష్ట్రంలో 1010 యాక్టివ్ కేసులు నమోదయాయి. ఇప్పటివరకు 925 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న 31 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1163కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 30 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: