రెండో విడత వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు కో-విన్ పోర్టల్ ద్వారా కోవిడ్ టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. టీకా వేయించేకోటానికి కొవిన్ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అందులో ఫోన్ లేదా ఆధార్ నంబరు ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత పేరు, వయసు, జెండర్ నమోదు చేయాలి. తర్వాత మొబైల్కు లింకు వస్తుంది. అందులో దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలను ఎంచుకోవచ్చు. రెండు డోసులు తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ పొందవచ్చు. టీకాకు వెళ్లినప్పుడు ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
అయితే, దీర్ఘకాలిక జబ్బులకు మందులు వాడుతున్నవారు, వాటిని రాసిచ్చిన వైద్యుడి వద్ద ఈ ధ్రువపత్రం తీసుకోవచ్చు. 60 ఏళ్ల పైబడినవారు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉంటే, కోమార్బిడిటీస్ ఉన్నవారు 10 లక్షల మంది ఉంటారని అంచనా. దేశంలో జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మొదటి విడతగా హెల్త్ కేర్ వర్కర్లకు, గత నెల 3 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ తదితర శాఖల ఉద్యోగులకు వేశారు.
కరోనా టీకాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో టీకా ఖరీదు 150 100 సర్వీసు చార్జీ. టీకాలు వేసుకునే వారు కోవిన్ వెబ్సైట్లో ముందుగా నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకోనట్టయితే, నేరుగా సంబంధిత కేంద్రాలకు గుర్తింపు కార్డులు, డాక్టర్లు ఇచ్చిన దృవపత్రాలు తీసుకెళ్లి కూడా టీకాలు పొందవచ్చు.