ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టణ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా టార్గెట్లు పెట్టేశారు. ఈ క్రమంలోనే పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కీలకమైన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యత అప్పగించారు. ప్రస్తుతానికి వైసీపీకి అక్కడ కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. ఇక్కడ పార్టీ గెలుపు జగన్కు, ప్రభుత్వానికే ఎంతో ప్రతిష్టాత్మకం.
ఈ క్రమంలోనే విజయసాయి ఇక్కడ వైసీపీని గెలిపించేందుకు సామ, దాన దండోపాయాలు అన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు డివిజన్ల టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇందులో ఒకరు పార్టీ అభ్యర్థి కూడా. ఇక దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ను కూడా పార్టీలో చేర్చుకోవడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాథుడు లేడు. ఇక తూర్పు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండడంతో అక్కడ కూడా విజయసాయి గట్టిగా దృష్టి పెడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఉప సంహరణలు పూర్తయ్యే సరికే కనీసం 15 డివిజన్లను వైసీపీకి ఏకగ్రీవం చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారట. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడంలో విజయసాయిరెడ్డి పాత్ర కీలకమని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఇక్కడ కార్పొరేషన్ను గెలిపించేందుకు గట్టిగా కష్టపడుతున్నారు. ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు.
ఇక్కడ రిజల్ట్ తేడా వస్తే జగన్ దగ్గర ఆయన పరపతి ఖచ్చితంగా పడిపోతుంది. ఈ భయంతోనే విశాఖ కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగర వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.