దివంగత సీఎం రాజశేఖరరెడ్డి జయంతి జులై8న షర్మిల పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే గత నెల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో వస్తున్నానని ప్రకటించిన షర్మిల అప్పటి నుండి ప్రజల్లో తన బలాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది షర్మిల. రెండుమూడురోజులకోసారి ట్విట్టర్ వేదికగా తెరాస ప్రభుత్వంపై విమర్శల దాడిచేస్తుంది. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే మేలు జరుగుతుందని షర్మిల విమర్శిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ వస్తుంది.
తాజాగా మరోసారి సీఎం కేసీఆర్పై షర్మిల విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు పాలన చేతకాకుంటే దిగిపోవాలని, కోర్టులకో, గవర్నర్కో అప్పజెప్పాలని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేషెంట్ల కోసం సరిపడా అంబులెన్స్లు లేవని, టెస్టులు చేసేందుకు కిట్లు, ఆక్సిజన్, వాక్సిన్లతో పాటు ఆస్పత్రుల్లో సరిపడ డాక్టర్లు, సిబ్బంది లేరని షర్మిల విమర్శలు చేశారు. షర్మిల ట్వీట్కు నెటిజర్లు గట్టికౌంటర్ ఇస్తున్నారు. ముందు ఆంధ్రాలో మీ అన్నను పాలన సక్రమంగా చేయమని చెప్పు అక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని ట్వీట్లు పెట్టినా తెరాస నేతలు ఎవరూ పట్టించుకోకపోవటం గమనార్హం. అసలు షర్మిల ఎవరు అన్నట్లుగా తెరాస నేతలు వ్యవహరిస్తున్న తీరునుచూసి షర్మిల వర్గీయులు కొంచెం మమ్మల్నీ పట్టించుకోండయ్యా అనే పరిస్థితికి వచ్చారని సోషల్ మీడియాలో పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి.