
ప్రస్తుతం అదే పరిస్థితి టీడీపీలోనూ కనిపిస్తోంది. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి దూకుడు గట్టిగా వినిపిస్తోంది. తనకి తానై, ఎవరినైనా విమర్శించేందుకు వెనుకాడడం లేదు. అధికారులను టార్గెట్ చేయడం, పార్టీ లోపలే విమర్శలు చేయడం ఆమెపై దృష్టిని పెంచుతోంది కానీ, అదే సమయంలో మైనస్ పాయింట్లను కూడా పెంచుతోంది. పార్టీ సీనియర్ నేతలు ఆమె తీరు పునఃపరిశీలించాలన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారం కూడా దీనికి దగ్గరగా ఉంది. ఆమెలోనూ ఫైర్ బ్రాండ్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆమె తీరు కార్యకర్తలను దూరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ప్రజలతో సాన్నిహిత్యం తగ్గిపోతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సమస్యలు చెప్పేందుకు వచ్చినవారికి కూడా ప్రతిస్పందన తక్కువగా ఉండటం, ప్రతిపక్షానికి మరింతగా ఛాన్స్ ఇవ్వడమే అవుతోంది.
ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా కనిపించడంలో తప్పు లేదు. కానీ ఆ ఫైర్ ఆచితూచి ఉండాలి. వ్యక్తిగత విమర్శల బాటలో కాకుండా, ప్రజా సమస్యలపై ధైర్యంగా మాట్లాడే దిశలో సాగితే నాయకుని ప్రతిష్ట పెరుగుతుంది. లేకపోతే అదే ఫైర్ ఆ నాయకుడి ఎదుగుదలపై నీడ వేసే ప్రమాదం ఉంది. మొత్తానికి, లేడీ సింగాలుగా గుర్తింపు సంపాదించడం ఓ మంచి ప్రయాణం మొదలయ్యేలా చేస్తుంది. కానీ ఆ ప్రయాణం కొనసాగాలంటే, జనం దగ్గర ఉండాలి. పార్టీతో కలిసుండాలి. ఇతరులను ఆకర్షించగలిగే భాష్యం ఉండాలి. లేదంటే, ఆ ఫైర్ ఒకరోజు ఆరుగదలై పొగమంచుగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో మాధవీరెడ్డి, అఖిలప్రియ వంటి నేతలు తమ దూకుడు – శైలిని పునఃపరిశీలించడం రాజకీయ భవిష్యత్తుకు మేలుగా ఉంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు.