ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువుగా ఉంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించినట్లు, ఈ సారి దాదాపు 80 మంది కొత్తవారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలన్నీ యువతకు, కొత్త నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తూ టిక్కెట్లు ఇచ్చాయి. కూటమి తరఫున వచ్చిన జోష్, ప్రజలు మార్పు కోర‌డంతో కొత్తవారు ఎక్కువుగా విజయం సాధించారు. ప్రజలు కూడా వీరిపై కొత్త రాజకీయ శైలి, మెరుగైన సేవలపై ఆశలు పెట్టుకున్నారు. పరిస్థితులు ఊహించిన దానికి విరుద్ధంగా మారుతున్నాయి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పలు వివాదాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. సింగనమల, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, తాడిపత్రి వంటి ప్రాంతాల్లో కొత్త నేతలు సీనియర్ నేతలతో తగవులు పెట్టుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది ప్రతిపక్షంతో పోరాటం కంటే, తమ పార్టీల్లోనే ఆధిపత్య పోరుగా మారిపోవడం గమనార్హం. చీరాల, బాపట్ల వంటి నియోజకవర్గాల్లో సీనియర్లకు గౌరవం లేకపోవడం, సహకారం అందకపోవడం వంటి ఆరోపణలు వ‌స్తున్నాయి.


ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ స్పష్టంగా సీనియర్ నేతల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని, జూనియర్లు వినయంగా కలిసిపోవాలని సూచించారు. కానీ వాస్తవానికి జూనియర్లు తమ మాటే వినిపించాలని పట్టుబడుతుండటం సీనియర్లలో అసహనాన్ని పెంచుతోంది. టీడీపీలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. సీనియర్ నాయకులు త‌మ‌ను పక్కన పెడుతున్నారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయ్యాయి.


అయినా ఈ అంతర్గత విభేదాల్లో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాలకు ముందు జూనియర్లకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించడం ప్రాముఖ్యంగా మారింది. ఈ క్లాసుల్లో సీనియర్ నేతల అనుభవం, విధానాలను పరిగణనలోకి తీసుకుని కొత్తవారికి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. జూనియర్లు - సీనియర్లు కలసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందుతాయి. లేకపోతే, పార్టీ లోపలి కలహాలు కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. ఏదేమైనా భ‌విష్య‌త్తులో నేతలు వ్యక్తిగత ఆధిపత్య ధోరణి పక్కనపెట్టి, సమన్వయం కలిగించుకోక‌పోతే ప్ర‌భుత్వానికి పెద్ద మైన‌స్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: