బిహార్‌ రాజకీయాల్లో మళ్లీ కొత్త ఉత్కంఠ నెలకొంది. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌ ఈసారి స్పష్టమైన నిర్ణయం తీసుకుంది — “మా సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌!” అని ధైర్యంగా ప్రకటించింది. ఒకప్పటి ఉపముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వారసుడిగా, ఇప్పుడు యువతకు నూతన దిశ చూపే నాయకుడిగా తేజస్వీ మళ్లీ రంగంలోకి దూసుకెళ్తున్నారు. పట్నాలో గురువారం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో కాంగ్రెస్‌, వామపక్షాలు, వికాస్‌శీల్‌ పార్టీ నేతలు ఒకే వేదికపై నిలబడి తేజస్వీ పేరును ప్రకటించడం రాజకీయంగా పెద్ద సందేశాన్ని ఇచ్చింది. ఈ సమావేశంలో ముకేశ్‌ సహనీని డిప్యూటీ సీఎంగా ప్రకటించడం వ్యూహాత్మక నిర్ణయం. తేజస్వీ యాదవ్‌ యువత ప్రతీక అయితే, సహనీ మత్స్యకార సమాజానికి ప్రతినిధి. అంటే కూటమి కుల, ప్రాంత సమీకరణాలను బలంగా సెట్ చేసుకుంది.

కానీ ఆసక్తికర అంశం ఏంటంటే - మహాగఠ్‌బంధన్‌ పోస్టర్లలో తేజస్వీ ఫోటో మాత్రమే ఉండి, రాహుల్‌ గాంధీ ఫోటో కనిపించకపోవడం. ఇది కేవలం డిజైన్‌ లోపమా లేక కాంగ్రెస్‌-ఆర్జేడీ మధ్య పెరుగుతున్న రాజకీయ దూరానికి సంకేతమా అన్నది చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ మాత్రం ఈ సీన్‌ను వదలలేదు. “ఇది సంయుక్త సమావేశమా? లేక ఒక పార్టీ ప్రైవేట్‌ షోనా?” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. కూటమిలో కూడా అంతర్గత సర్దుబాట్లు పూర్తిగా జరగలేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌ 61, ఆర్జేడీ 143, వామపక్షాలు 13 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. కానీ కొన్ని సీట్లలో మూడు పార్టీలు ఒకేసారి అభ్యర్థులను పెట్టడం గందరగోళానికి దారి తీసింది. దీంతో ‘కూటమిలో కూటమి పోటీ’ అనే పదం ఇప్పుడు బిహార్‌ మీడియా హెడ్లైన్లలో మార్మోగుతోంది. అయితే తేజస్వీ యాదవ్‌ ఇప్పుడు పూర్తిగా మునుపటి కంటే విభిన్నంగా ఉన్నారు.

2020 ఎన్నికల్లో 75 సీట్లు సాధించిన అనుభవం, యువత మద్దతు, లాలూ వారసత్వం - ఇవి ఆయనకు పెద్ద ఆయుధాలు. ఆయన “నూతన బిహార్‌ - నూతన దిశ” నినాదంతో ముందుకు సాగుతుంటే, ఎన్డీయే మాత్రం “అనుభవం - అభివృద్ధి - స్థిరత్వం”తో రంగంలో ఉంది. ఒకవైపు యువ ఉత్సాహం, మరోవైపు వయసు, అనుభవం మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. బిహార్‌ ఎన్నికలు ఎప్పుడూ కేవలం సీట్ల పోరు కావు - అవి భావజాల యుద్ధం. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతోంది. తేజస్వీకి ఈ ఎన్నిక కేవలం రాజకీయ పరీక్ష కాదు, అది తరం మార్పు పోరు. లాలూ-నితీష్‌ యుగం ముగిసి, కొత్త తేజస్వీ యుగం మొదలవుతుందా? లేక మళ్లీ పాత నేతలే ఆధిపత్యం చెలాయిస్తారా? అన్నది నవంబర్‌ 14తో తేలనుంది. కానీ ఇప్పుడే చెప్పొచ్చు — బిహార్‌ ప్రజలు కొత్త కథ కోసం ఎదురు చూస్తున్నారు… ఆ కథలో హీరోగా తేజస్వీ నిలుస్తారా? లేక ప్రేక్షకులకే షాక్‌ ఇస్తారా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: