న్యూఢిల్లీ: దేశంలో అత్యాచార బాధితులకు సంబంధించి నిర్భయ తల్లి ఆశాదేవి సంచలన ప్రతిజ్ఞ చేశారు. తన తదుపరి జీవితం మొత్తం అత్యాచార బాధితులకు న్యాయం చేయడం కోసమే పోరాడుతానని శపథం చేశారు. నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష విధించిన 9నెలల తర్వాత తొలిసారి ఆమె మీడియా ముందుకొచ్చారు. నిందితులకు సరైన శిక్ష పడిందని, అత్యాచారానికి గురైన తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరిందని నిర్భయ తల్లి అన్నారు. అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా తాను పోరాడుతానని అన్నారు.

‘‘నా కుమార్తెకు న్యాయం జరిగింది. కానీ నేను మౌనంగా ఉండను. అత్యాచార బాధితులందరికీ న్యాయం జరిగేలా పోరాడుతాను. నా కుమార్తెకు నేను అర్పించి నివాళి అదేనని భావిస్తాను. అత్యాచారాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలి’’ అని ఆశాదేవి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన కుమార్తెపై అత్యాచారం చేసిన దుర్మార్గులను ఉరితీసిన తర్వాత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం కలిగిందని అశాదేవి చెప్పారు.

అయితే నిందితుల తరపున వాదించిన డిఫెన్స్ లాయర్ల విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. డిఫెన్స్ లాయర్లు దోషులకు శిక్ష అమలు జరగకుండా చాలాసార్లు వాయిదా పడేలా చేశారని, అది తనను చాలా బాధించించిందని ఆశాదేవి అన్నారు. అందుకే అత్యాచార బాధితుల తరపున తాను కూడా ఇకనుంచి పోరాడేందుకు సిద్ధమవుతానని చెప్పారు. ప్రతీ అత్యాచార బాధితుల ముఖంలో తన కుమార్తెను చూస్తున్నానని ఆశాదేవి తెలిపారు.


డిసెంబరు 16కు నిర్భయ ఘటన జరిగి 8 ఏళ్లు గడిచిన నేపథ్యంలో అప్పటి ఘటనను దేశం మొత్తం గుర్తు చేసుకుంటోంది. నిర్భయ ఘటనతోనే దేశంలో మహిళలపై జరిగే నేరాలకు కఠినమైన చట్టాలుండాల కోసం డిమాండ్ పెరిగింది. ఆ నేపథ్యంలోనే 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. 1973 క్రిమినల్ లా కు సవరణగా ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.

ఈ క్రమంలోనే 2013 మార్చి 19న లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, 2013 మార్చి 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ తర్వాత ఏప్రిల్ 2న రాష్ట్రపతి ఆమోదం పొందడం ద్వారా చట్టంగా రూపాంతరం చెందింది. ఈ చట్టం ప్రకారం.. మహిళలపై జరిగే అత్యాచారాలకు జైలు శిక్ష నుంచి మరణ శిక్ష వరకు విధించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: