వర్షాకాలం రాగానే ఉరుములు, మెరుపులు సహజమే. కొన్ని గంటల పాటు ప్రకృతిలో ఓ రకమైన ఉత్కంఠ నెలకొంటుంది. అటువంటి సమయాల్లో మనుషులు, పశువులు, చెట్లు కూడా పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. మనం తరచూ వార్తలలో చూసే ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉంటాయి. అయితే పిడుగుపాటుతో మనుషుల ప్రాణనష్టం గురించి అందరికీ తెలిసిన విషయమే అయినా... చెట్ల నష్టం గురించి మాత్రం అంతగా తెలియదు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 32 కోట్ల చెట్లు పిడుగుపాటుకు గురై చనిపోతున్నాయి! ఈ విషయాన్ని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ (TUM) కు చెందిన శాస్త్రవేత్తలు గల గ్లోబల్ స్థాయిలో జరిపిన పరిశోధన ద్వారా నిర్ధారించారు. ఈ అధ్యయనంలో వారు గ్లోబల్ వెజిటేషన్ మోడల్స్ (Global Vegetation Models), మెరుపు (లైట్‌నింగ్) నమూనాలు మరియు ఉపగ్రహ డేటాను అనుసంధానించి ఈ అంచనాకు వచ్చారు. పరిశోధకుల ముఖ్య ఉద్దేశం పిడుగుపాటు వల్ల అడవులు, వనరులు, మరియు కార్బన్ నిల్వలపై ఎంత ప్రభావం పడుతోందనే విషయాన్ని అధ్యయనంలో గుర్తించడమే.


పెరుగుతున్న నష్టాలు… ప్రమాదకర భవిష్యత్ ...  అధ్యయన ప్రకారం, పిడుగుపాటుతో చనిపోయే చెట్ల వల్ల ప్రపంచ మొక్కల బయోమాస్‌లో 2.1% నుంచి 2.9% వరకు నష్టం జరుగుతోంది. ఇది అనూహ్యమైన సంఖ్య. అంతేకాకుండా, ఈ చెట్లు కుళ్లిపోయే ప్రక్రియలో సంవత్సరానికి 0.77 నుంచి 1.09 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాయువు వాతావరణంలోకి వెళ్తోందని, ఇది వాతావరణ మార్పుల దృష్ట్యా అత్యంత ఆందోళనకర విషయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కడ ఎక్కువ ప్రమాదం? ..  ఈ పరిశోధన ప్రకారం, పిడుగుపాటు వల్ల ఎక్కువగా నష్టాన్ని చవిచూస్తున్న ప్రాంతాలు సాధారణంగా వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే, తేమతో కూడిన ట్రోపికల్ అడవులు. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా, దక్షిణాసియాలోని అడవి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.



భవిష్యత్‌లో ఏమి చేయాలి? .. పిడుగుపాటు వల్ల కలుగుతున్న ఈ తీవ్ర నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, అడవుల పరిరక్షణకు కొత్త విధానాలు, మెరుగైన నిఘా పద్ధతులు, మరియు సరైన అంచనా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. పిడుగుల ప్రభావాన్ని నివారించలేకపోయినా, దానికి గురయ్యే చెట్లను గుర్తించడంలో టెక్నాలజీని వినియోగించాలి.ఈ అధ్యయనం ప్రకారం, వాతావరణ మార్పు కారణంగా పిడుగుల తీవ్రత, వరుసగా వాటి frequency పెరుగుతుందన్నది ఖచ్చితమే. అందువల్ల, మనం అడవుల సంరక్షణను మరింత వ్యూహాత్మకంగా, శాస్త్రీయంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్యంగా పిడుగు అనగానే ఒక్కసారిగా భయపడే స్థితి ఉన్నా.. అది చెట్లకు ఎంత తీరని నష్టాన్ని కలిగిస్తుందో ఇప్పుడు స్పష్టమవుతోంది. ప్రకృతి తట్టుకోలేని స్థాయికి చేరకముందే, మనం స్పందించాల్సిన సమయం ఇది

మరింత సమాచారం తెలుసుకోండి: