ఒకరికి తెలియకుండా మరొకరిని వలలో వేసుకుంటూ ఆరు పెళ్లిళ్లు చేసుకున్న మహిళ, ఆమె తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా కిలేడీ తండ్రికి మైదుకూరు న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో వారు మోసాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు కడప జిల్లా ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే నెలలో వివాహమైంది. అమ్మాయి అందంగా ఉండటంతో రామకృష్ణారెడ్డి ఆమెను ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.


మూడు నెలల పాటు వీరి కాపురం సక్రమంగానే సాగింది. ఆగస్టు 25వ తేదీన కూతురి ఇంటికి వచ్చిన అనంతరెడ్డి మౌనికను పుట్టింటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాతి నుంచి అనంతరెడి, మౌనిక ఆచూకీ తెలియలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చి రామకృష్ణారెడ్డి ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మౌనిక హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. వివరాలు ఆరా తీయగా చంటినాయక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నట్లు తేలింది.


దీంతో పోలీసులు మౌనికను అదుపులోకి విచారించగా, చంటినాయక్, రామకృష్ణారెడ్డి కంటే ముందే ఆమె మరో నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితురాలితో పాటు ఆమె తండ్రి, ఆరో భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఏడాదిగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా మౌనిక తండ్రిని దోషిగా నిర్ధారించిన కోర్టు అతడికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. అయితే బెయిల్‌పై వచ్చిన మౌనిక, చంటినాయక్ వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వారిద్దరు దొరికితేనే నేరంగా కోర్టు తీర్పు వెలువరించే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: