బాలీవుడ్లో నిన్నటి తరం లెజెండ్రీ హీరో రిషీకపూర్ గురువారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. 67 సంవత్సరాల రిషీ రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోగా రాణించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన జీవిత ప్రస్థానం విషయానికి వస్తే 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆయన బాబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆయన ఆ సినిమాతో ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్కు భార్య నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ఉన్నారు. రిషీకపూర్ తన భార్య అయిన రితూకపూర్ను 1980లో పెళ్లి చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.