ఎన్నికల ముందు వైఎస్‌ జగన్ సర్కారు తన ఎమ్మెల్యేలకు దోచి పెడుతోందా.. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్‌ రెడీ చేశారా.. అంటే అవునంటోంది ఓ ప్రముఖ దిన పత్రిక. ఈ మేరకు సంచలన కథనం వెలువరించింది. వాసుపల్లి గణేశ్‌ తన ‘వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ’ విద్యాసంస్థ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమి పొందేందుకు ప్రయత్నించారట.


10 ఎకరాల వరకు భూములు నామమాత్రపు ధరకు కేటాయించేలా ప్రభుత్వం నుంచి అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారట. మూడుచోట్ల కలిపి 6.90 ఎకరాలు అప్పగించబోయారట. ఈ భూమి మార్కెట్‌ విలువ సుమారు రూ.82 కోట్లుపైగానే ఉంటుందట.
అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయట. వాసుపల్లి గణేశ్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా పలుచోట్ల ఎంపీసీ, ఐఐటీ, డిఫెన్స్‌ రంగాల్లో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఇక్కడ ఒక్కో విద్యార్థికి హాస్టల్‌ వసతితో కలిపి సుమారు రూ.2.20లక్షలు, డేస్కాలర్‌ అయితే రూ.80వేల చొప్పున ఫీజులు తీసుకుంటున్నా... ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ భూమికి టెండర్‌ పెట్టేశారట. నిబంధనల ప్రకారం...  ప్రైవేటు రంగంలో ఉన్న డిఫెన్స్‌ అకాడమీకి భూముల కేటాయించాలంటే  నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి సిఫార్సులు రెవెన్యూ శాఖకు అందాలి. ఆ తర్వాత జీవీఎంసీ నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవేమీ లేకుండానే విశాఖ జిల్లా కలెక్టర్‌ నుంచి భూ కేటాయింపులపై ప్రతిపాదనలు రెవెన్యూ శాఖకు వచ్చాయట.


అంతే కాదు.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ తన భూముల వరకూ ప్రత్యేకంగా రోడ్డు కూడా వేయించుకున్నారట. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి 88వ వార్డు నరవలో కొనుక్కున్న భూములకు జీవీఎంసీ నిధులతో రహదారి పనులు చేపడుతున్నారట. అయితే ఎన్నికలకు ముందు వైసీపీ నేతలపై నెగిటివ్‌ కథనాలు రాయడంలో టీడీపీ అనుకూల మీడియాకు అలవాటే. మరి ఈ కథనంలో వాస్తవం ఏంటో వాసుపల్లే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: