ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి ఆసక్తికర మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ–జనసేన - టీడీపీ కూటమిపై అధికార పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, మరోవైపు కొత్త కూటమి రూపుదిద్దుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కొత్త కూటమి వైసీపీ చుట్టూ తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జైభీం పార్టీ నాయకుడు జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయి. ఆయన మాట్లాడుతూ, “ జగన్‌ చేతులు చాపకపోయినా , ఆయనను కౌగిలించుకోవడానికి నాలుగు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి ” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద హడావుడి రేపాయి. ఆయన సూచించిన ఆ నాలుగు పార్టీలు — ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), జైభీం పార్టీ, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ స్థాపించిన ఎస్సీ పార్టీ అని చెబుతున్నారు.


ఇక ఈ చిన్నా చితకా పార్టీలకు పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినా, సామాజిక వర్గాల స్థాయిలో ఇవి ప్రభావం చూపగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, జైభీం పార్టీలు డిపాజిట్లు కాపాడుకోలేకపోయినా, ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల వరకు ప్రభావం చూపించాయి. ఈ పార్టీలకు తగిన స్థాయిలో కేడర్ ఉన్నందున, వైసీపీతో కూటమి కుదిరితే ఆ ఓట్లన్నీ జగన్ వైపుకే వెళ్లే అవకాశముంది. ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా వైసీపీ వైపు చూస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సీపీఎం నేతలు వైసీపీ ప్రభుత్వానికి పరోక్ష మద్దతు ఇచ్చినట్లు కూడా చర్చ జరిగింది. అయితే ఈసారి వారు కూటమి స్థాయిలో ముందుకు వస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. జ‌గ‌న్ ఎన్డీయే కూట‌మికి వ్య‌తిరేకంగా ఈ డేరింగ్ స్టెప్ వేస్తారా ? అన్న‌ది కూడా చూడాలి.


అయితే వైసీపీ అధినేత జగన్ ఈ కూటమి ప్రయత్నాల పట్ల అంత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు కూడా బీజేపీ నేతలు వైసీపీతో పొత్తుకు ప్రయత్నించారని, కానీ మైనారిటీ ఓటు బ్యాంకు దృష్ట్యా జగన్ ససేమిరా అన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన అదే విధమైన జాగ్రత్త వైఖరిని కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త కూటమి వైసీపీతో కలిసి రానిచో, కనీసం ప్రత్యామ్నాయ వామపక్ష బలంగా నిలవాలని ప్రయత్నిస్తోంది. జడ శ్రావణ్ చెపుతోన్న దాని ప్రకారం, “ మేము వైసీపీతో కలవడం వల్ల ప్రజల్లో సెక్యులర్ బలం పెరుగుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి నేను ముందుండి నడిపిస్తా ” అని అన్నారు. ఈ చిన్న పార్టీలు ఒక్కటవడం రాజకీయంగా పెద్ద ప్రభావం చూపకపోయినా, సామాజిక సమీకరణ దృష్ట్యా వైసీపీకి ఓ బూస్ట్ ఇవ్వగలదని భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఈ కొత్త మిత్ర బృందం ఏ మేరకు రూపం దాల్చుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: