టాలీవుడ్‌ స్టార్ హీరో బాలకృష్ణ నిన్నటివరకు వెండితెరకే ఎక్కువగా పరిమితం కాగా... ఇప్పుడు ఆయన బుల్లితెర బాలయ్యగా కూడా అవతారమెత్తారు. "ఆహా" లో అన్‌స్టాపబుల్‌ టాక్‌ విత్‌ ఎన్‌బీకే పేరిట ప్రోగ్రామ్‌ ద్వారా అటు వెండి తెరతోపాటు ఇటు బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీతో బాలయ్య టాక్‌ షోకు లభించిన ఆదరణే నిదర్శనంగా నిలుస్తోంది. బాలయ్య నవ్వుతూ అడిగే ప్రశ్నలు... అదే రీతిలో మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణులు వెల్లడించిన సమాధానాలతో టాక్‌ షో సరదా సరదాగా సాగింది. దీనికి ప్రేక్షకాదరణ అమితంగా ఉండటంతో బాలయ్య టాక్‌ షోకు తిరుగు ఉండదని ఇండస్ట్రీ వర్గాలవారు అంచనా వేస్తున్నారు.

నిజానికి సినీ పరిశ్రమలో అల్లు అరవింద్‌, బాలకృష్ణలు ఉత్తర ధృవం, దక్షిణ ధృవం అన్నట్లుగా ఉంటారు. అల్లు అరవింద్‌ ఎక్కువగా కమర్షియల్‌గా ఆలోచిస్తుంటారని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. అలాగే బాలకృష్ణ నిర్మాతల పట్ల చాలా ఉదారంగా ఉంటారన్న అభిప్రాయం కూడా ఉంది. నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా బాలయ్య వ్యవహరిస్తుంటారని అంటుంటారు. అయితే ఫక్తు బిజినెస్‌ మెన్‌గా అల్లు అరవింద్‌ వ్యవహరిస్తారని కూడా అంటుంటారు. అలాంటి వారిద్దరిని "ఆహా" టాక్‌ షో దగ్గర చేసిందనే చెప్పాలి. "ఆహా" టాక్‌ షోకు బాలకృష్ణ అయితే బాగుంటుందని అల్లు అరవింద్‌ అనుకోవడం, ఈ విషయంగా బాలయ్యతో ఫోన్‌లో మాట్లాడటం, తాను టాక్‌ షో చూస్తుంటానని.. ఆ షో చేస్తానని బాలయ్య చెప్పడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే బాలయ్య తన శైలికి భిన్నంగా "ఆహా" ఓటీటీలో టాక్‌ షో చేస్తున్నారు.

ఇదిలావుంటే, "ఆహా" ఓటీటీలో అన్‌స్టాపబుల్‌ టాక్‌ విత్‌ ఎన్‌బీకే షో ద్వారా బాలయ్యకు, అల్లు అరవింద్‌కు మంచి టెంపో కుదరవచ్చని చర్చ జరుగుతోంది. ఇది మెగా ఫ్యామిలీకి బాలయ్యను దగ్గర చేస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమలో తొలుత ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ మధ్య గట్టి పోటీ ఉండేది. వాస్తవ జీవితంలో వారిద్దరూ మంచి స్నేహితులే అయినప్పటికీ.. సినిమాల పరంగా మాత్రం ఒకరితో ఒకరు పోటీ అన్నట్లుగా ఉండేవారు. దీంతో ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ ఫ్యాన్స్‌ కూడా వారి సినిమాల విషయంలో వైరీవర్గాలుగా వ్యవహరించేవారు.
ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరి అభిమానులు కూడా కాస్తా తీవ్రస్థాయిలోనే వైరీవర్గాలుగా వ్యవహరించారు. దీంతో చిరంజీవి, బాలకృష్ణలు కలిసిన వేదికలు చాలా అరుదనే చెప్పాలి. ఇక మెగా ఫ్యామిలీలో అల్లు అరవింద్‌ పెద్దరికంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్‌.. బాలయ్యకు జై  కొట్టారు. ప్రస్తుతం "ఆహా" టాక్‌ షో బాలయ్యతో చేయిస్తుండటంతో.. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మెగా ఫ్యామిలీకి బాలకృష్ణ చేరువ అవుతారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: