- కైకలూరులో భార్య మేనమామ బీజేపీ కామినేని కోసం రోడ్ షో
- ఏపీలో ఒక పార్టీ.. తెలంగాణలో మరో పార్టీ.. వెంకీది విచిత్ర పరిస్థితి..!
( హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ )
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. నాలుగు దశాబ్దాల కెరీర్లో వెంకటేష్ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. వెంకటేష్ తన సినిమాలు.. తన లోకం ఏంటో చూసుకుంటారే తప్పా బయట పెద్దగా కనపడరు. ఇక రాజకీయ పరమైన అంశాలకు కూడా వెంకటేష్ ఎప్పుడూ దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి వెంకటేష్ ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రెడీ అవుతుండడం విశేషం. అది కూడా తన బంధువుల కోసం కావడం గమనార్హం.
మరో ట్విస్ట్ ఏంటంటే వెంకటేష్ తెలంగాణలో ఒక పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తుంటే.. ఇటు ఏపీలో మరో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచార రంగంలోకి దిగనున్నారు. వీరిద్దరు కూడా వెంకీకి బంధువులు కావడం విశేషం. మరి ఆ ఇద్దరి బంధువులు ఎవరు ? ఏయే పార్టీల నుంచి ? ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.. ఆ విశేషాలేంటో ఇండియా హెరాల్డ్ మీకోసం అందిస్తోంది.
ఖమ్మంలో తన వియ్యంకుడి కోసం...
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామిరెడ్డి పోటీలో నిలబడ్డారు. ఆయన ఎవరో కాదు మన వెంకటేష్కు స్వయానా వియ్యంకుడు. ఆయన తండ్రి వరంగల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా.. డోర్నకల్ నుంచి మరో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన కుమారుడు అయిన రఘురామిరెడ్డి పెద్ద కొడుకు వెంకీకి అల్లుడు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు రామ సహాయం రఘురామిరెడ్డి స్వయానా మామ. ఆయన అబ్బాయి వినాయక్ రెడ్డిని అశ్రిత పెళ్లాడింది. ఈ క్రమంలోనే ఖమ్మం పార్లమెంటు పరిధిలో వెంకీ ఒకటి లేదా రెండు రోజులు ప్రచారం నిర్వహించనున్నారు.
ఇక ఏపీలోనూ బీజేపీ క్యాండెట్ కోసం ప్రచారం...
ఏపీలో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోనూ వెంకటేష్ పాల్గొంటారని సమాచారం. ఏలూరు జిల్లా కైకలూరులో బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కోసం వెంకీ ఒక రోజు రోడ్ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. కామినేని శ్రీనివాస్ ఎవరో కాదు... వెంకీ భార్య దగ్గుబాటి నీరజకు స్వయానా మేనమామ. ఇలా వెంకీ ఏపీలో ఒక పార్టీ నేతకు.. తెలంగాణలో మరో పార్టీ నేతకు ఎన్నికల ప్రచారం చేసి పెట్టనున్నారు.